వీణా-వాణీల దారెటు?: ఇంటికా లేక ప్రభుత్వ సంరక్షణలోకా?
హైదరాబాద్: అవిభక్త కవలలు వీణా-వాణీలు తల్లిదండ్రులతో వెళ్తారా? లేక ప్రభుత్వం ఆధ్వర్యంలోని సంరక్షణ కేంద్రంలో ఉంటారా? అనే విషయంలో సందిగ్థత నెలకొంది. పిల్లల్ని తీసుకెళ్లే విషయమై తల్లిదండ్రులకు ఇచ్చిన సమయం గురువారంతో ముగియడంతో తాజాగా నీలోఫర్ ఆసుపత్రి వైద్యులు వారిని సంప్రదించారు.
వీణా-వాణీలకు శస్త్రచికిత్స సాధ్యం కాదని ఎయిమ్స్ వైద్యబృందం తేల్చిన చెప్పడంతో వారిని నిలోఫర్ నుంచి ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా ఆసుపత్రి వర్గాలు అవిభక్త కవలల తల్లిదండ్రులకు సూచించారు. ఐదు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పిన గడువు గురువారంతో ముగియడంతో మరోసారి ఆసుపత్రి వర్గాలు తల్లిదండ్రులను ప్రశ్నించాయి.
దీంతో వారు మరో ఐదు రోజుల గడువు కావాలని వారు అధికారులను కోరినట్లు నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. సురేష్కుమార్ తెలిపారు. మరో పది రోజులు పాటు ఆసుపత్రిలో ఉంచి, అనంతరం స్త్రీ శిశు సంక్షేమ శాఖకు అప్పగించే విషయమై నీలోఫర్ వైద్యులు ఆలోచనలో ఉన్నారు.
ఇందుకోసం ప్రభుత్వం అనుమతి కోరుతూ లేఖ రాయనున్నట్లు ఆసుపత్రి సూపరిటెండెంట్ తెలిపారు. కాగా ప్రస్తుతం వీణా-వాణీల వయసు 13 సంవత్సరాలు. గత తొమ్మిది సంవత్సరాలుగా వీరు నీలోఫర్ ఆసుపత్రిలోనే ఉంటున్నారు. చిన్న పిల్లలకు చికిత్సను అందించే నీలోఫర్ ఆసుపత్రిలో వీరిద్దరిని ఉంచడం ఈ అవిభక్త కవలలకు మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.
వీణా-వాణీలకు శస్త్రచికిత్స సాధ్యం కాదని ఎయిమ్స్ వైద్యబృందం తేల్చిన అనంతరం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి వెంటనే స్పందించారు. ప్రభుత్వ పరంగా వీణా-వాణీలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రకటించారు.
ఈ ప్రకటన చెప్పి పది రోజులు గడిచినా ఏ విధంగా ఆదుకుంటామనే దానిపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. రెక్కాడితే డొక్కాడని బతుకులు తమవని, కూలికి వెళితే తప్ప పుటగడవడం కష్టమని వీణా-వాణీల తల్లిదండ్రులు వాపోతున్నారు.
పిల్లలను తమతో తీసుకెళ్లడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, ఇప్పటికే తమకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఆర్ధికంగా సాయం అందించాలని వారు కోరుతున్నారు. ఇదిలా ఉంటే అవిభక్త కవలలు వీణా-వాణిలకు శస్త్రచికిత్స చేసేందుకు ఆస్ట్రేలియాలోని ప్రపంచ ప్రఖ్యాత రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ (ఆర్సీహెచ్) సానుకూలంగా స్పందించింది.
తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి ఈ ఆసుపత్రిని సందర్శించి వీణా-వాణిల శస్త్రచికిత్సపై వైద్య నిపుణులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆర్సీహెచ్ వైద్యులు గతంలో చేసిన ఆపరేషన్ల గురించి నిరంజన్ రెడ్డికి వివరించారు. వీణా-వాణిలకు ఆపరేషన్ చేసే విషయంపై సానుకూలంగా స్పందించారని నిరంజన్ రెడ్డి చెప్పారు.