జిల్లాల ఏర్పాటుపై కసరత్తు, రాజీవ్ శర్మ అధ్యక్షతన కమిటీ: చిక్కులేనా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్ వ్యవస్థీకరణకు కమిటీని ఏర్పాటు చేసింది.
రాష్ట్రంలో కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో టిఆర్ఎస్ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో.. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్వ్యవస్థీకరణ చేసేందుకు సీఎస్ రాజీవ్ శర్మ అధ్యక్షతన పునర్వ్యవస్థీకరణ కమిటీని ఏర్పాటు చేసింది.
సోమవారం నాడు ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా వ్యవహరిస్తారు.
కమిటీకి వివిధ శాఖలకు చెందిన ఎనిమిది మంది అధికారులు సహాయ సహకారాలు అందిస్తారు. ఈ కమిటీ జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్ వ్యవస్థీకరణపై అధ్యయనం చేసి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించనుంది.
కాగా, తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వానికి చిక్కేనని చెప్పవచ్చు. ఇప్పటికే కొత్త జిల్లాల కోసం పలు ప్రాంతాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విపక్షాలు కొత్త జిల్లాల ఏర్పాటుపై గళం విప్పుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తుందనేది తెలియాల్సి ఉంది.
తలసాని అనర్హత అంశంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన గోపీనాథ్
తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అనర్హత అంశంపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్రపతి భవన్ సదరు ఫిర్యాదును కేంద్ర హోంశాఖ కార్యదర్శికి పంపినట్లు సమాచారమిచ్చింది.