పాక్తో యుద్ధం వస్తే, అవసరమైతే డ్యూటీలో జాయిన్ అవుతా: ఉత్తమ్, గర్వించే ప్రకటన
హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ప్రతి భారతీయుడు మెచ్చే, ఆనందించే ప్రకటన చేసారు. యూరీ ఘటనకు కౌంటర్గా ఇండియన్ ఆర్మీ పీవోకేలో సర్జికల్ స్ట్రయిక్ నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై ఉత్తమ్ కుమార్ స్పందించారు.
ఉత్తమ్ ఇరవై ఏళ్లు భారత వాయుసేనలో మిగ్ ఎయిర్ క్రాఫ్ట్ పైలట్గా సేవలు అందించారు. తన అంచనా ప్రకారం భారత్కు ప్రస్తుతం కష్టకాలమని, యుద్ధం దేనికీ పరిష్కారం కాదని ఉత్తమ్ చెప్పారు. అయితే అస్థిర పాకిస్థాన్తో యుద్ధం వచ్చే పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
పాకిస్థాన్ ఎప్పుడు ఎలా స్పందిస్తుందో చెప్పడం కష్టమన్నారు. దీంతో యుద్ధం వస్తుందనే అంచనా వేస్తున్నట్లు తెలిపారు. యుద్ధం వస్తే, అవసరమంటే ఏ క్షణమైనా విధుల్లో జాయిన్ అయ్యేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. దేశానికి సేవ చేయడం కంటే భాగ్యం ఏముంటుందన్నారు. రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన ఏదీ మర్చిపోయానని అనుకోవద్దని, ఈ క్షణంలో అయినా విధుల్లో చేరేందుకు సిద్ధమన్నారు.
యుద్ధం తప్పదేమో
ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం తప్పదనిపిస్తోందని ఉత్తమ్ అన్నారు. ఇలాంటి ఆపరేషన్లలో నాణ్యమైన పరికరాలతో, అద్భుతమైన ప్రణాళికతో, క్లిష్టమైన, అనితరసాధ్యమైన సామర్థ్యంతోనే విజయాలు సాధ్యమవుతాయన్నారు.
నైట్ విజన్ గాగుల్స్, జీపీఎస్ పరికరాలు, నాణ్యమైన ఆయుధ సామాగ్రితో ఇలాంటి కార్యక్రమాలు చేపడతారన్నారు. ఉపగ్రహాల సహాయం, నిఘా వర్గాల సాయంతో తీవ్రవాదుల కదలికలు గుర్తించి వారి అంతు చూస్తారన్నారు. యుద్ధం సమయాల్లో శబ్దవేగానికి రెండు రెట్ల వేగంతో విమానాలను నడపాల్సిన అవసరం ఉంటుందని, ఆ సమయంలో క్షణాల్లో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంతో పాటు సాంకేతిక, యుద్ధ అంశాలపై పూర్తి స్థాయిపట్టు అవసరమన్నారు.