మన మెట్రోదే ఆ రికార్డు: టికెట్ ధరపై కేటీఆర్, అటు టెస్టులు, ఇటు స్పీడ్(పిక్చర్స్)
మన రాజధాని మెట్రోరైల్ ప్రపంచంలోనే పీపీపీ పద్ధతిలో నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టు అని మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు.
Recommended Video
హైదరాబాద్: మన రాజధాని మెట్రోరైల్ ప్రపంచంలోనే పీపీపీ పద్ధతిలో నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టు అని మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. మెట్రోరైల్ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.3వేల కోట్లు కేటాయించిందని, ఆ నిధుల్లో ఇప్పటికే 2,240 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి కేటీఆర్ శాసనసభలో తెలిపారు.
ఆ రికార్డు మనదే..
నవంబర్ 28న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో ఇప్పటివరకూ ప్రారంభమైన మెట్రోరైలు ప్రాజెక్టులు 11 కిలోమీటర్లకు మించలేదని.. హైదరాబాద్లో తొలిసారిగా 30కిలోమీటర్ల మార్గాన్ని ప్రారంభించడం ఓ రికార్డు అని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది చివరి నాటికి మెట్రోరైల్ ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తిచేస్తామన్నారు.
వేగం పెరిగింది..
ఎంఎంటీఎస్ రెండో దళ పనులను టీఆర్ఎస్ ప్రభుత్వం వేగవంతం చేసిందని, రూ.817కోట్ల నిధులతో పనులు జరుగుతున్నాయని కేటీఆర్ తెలిపారు. ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ మార్గాన్ని విస్తరిస్తామన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పలు ఫొటోలను కూడా కేటీఆర్ పోస్టు చేశారు.
ప్రారంభోత్సవానికి సిద్ధం..
హైదరాబాద్ నగరంలో జరుగుతున్న పలు స్టేషన్ల నిర్మాణ ఫొటోలను కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. పనులు వేగంగా జరుగుతున్నాయని, ప్రారంభోత్సవానికి సిద్ధమంటూ తెలిపారు. అలాగే, రాయగిరి రైల్వేస్టేషన్ను యాదాద్రి స్టేషన్గా మార్చి అభివృద్ధి చేస్తామన్నారు.
ధరలు అందుబాటోనే.. కానీ,
మెట్రో రైలు విజయవంతం కావాలంటే టికెట్ ధరే కీలకమని ఓ నెటిజన్ అభిప్రాయపడగా.. అలా ఏం ఉండదని మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. అయితే, టికెట్ ధర మరి ఎక్కువగా, మరీ తక్కువగా ఉండదని, ప్రజలకు అందుబాటులోనే ధరలు ఉంటాయని చెప్పుకొచ్చారు.
మెట్రోకు పరీక్షలు..
మెట్రో ప్రారంభోత్సవం తర్వాత సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్ మెట్రో రైలుకు ప్రారంభానికి ముందే డిపోలోనూ, పట్టాలపైనా నిశితంగా పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. నవంబర్ 28న మియాపూర్ నుంచి నాగోల్ వరకు 30 కి.మీ. మార్గాన్ని ప్రారంభించనున్నారు. మియాపూర్ నుంచి ఎస్ఆర్నగర్ 12 కి.మీ., నాగోల్ నుంచి మెట్టుగూడ 8 కి.మీ. మార్గంలో టెస్ట్, ట్రయల్ రన్లు పూర్తయి మెట్రో నడవడానికి అనుమతులన్నీ వచ్చేశాయి. మెట్టుగూడ నుంచి ఎస్ఆర్నగర్ వరకు 10 కిలోమీటర్ల మేర టెస్ట్ రన్లు జరుగుతున్నాయి. ఈ నెల మూడో వారానికి ట్రయల్ రన్ పూర్తిచేయాలని మెట్రోవర్గాలు యోచిస్తున్నాయి.
12రకాల పరీక్ష్లలు..
కాగా, హైదరాబాద్ మెట్రో రైలు కోచ్లను కొరియా నుంచి దిగుమతి చేసుకున్నారు. కర్మాగారంలో తయారీ సమయంలోనే పలు పరీక్షలు చేశారు. అన్నీ సరిగా ఉన్నాయని సంతృప్తి చెందాకే హైదరాబాద్కు తీసుకొచ్చారు. కోచ్ విడదీసి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక మళ్లీ అమర్చి ఉప్పల్, మియాపూర్ డిపోల్లో మరోసారి పరీక్షలు చేశారు. ఉన్నచోటనే వ్యవస్థలన్నీ పనిచేస్తున్నాయో లేదోనని ‘స్టాటిక్ టెస్ట్'లు చేపట్టారు.
డిపోలో పరీక్షల కోసం ఏర్పాటు చేసిన ట్రాక్పై పరుగులు పెట్టేటప్పుడు మొదట డైనమిక్ పరీక్షలు చేస్తారు. అనంతరం వయాడక్ట్ పట్టాలపైకి తీసుకొస్తారు. ప్రయాణ సమయంలో మెట్రో రైలులోని కీలక వ్యవస్థలు ఎలా పని చేస్తున్నాయో బేరీజు వేసేందుకు 12 రకాల పరీక్షలు చేస్తారు. ప్రొపల్షన్ సిస్టమ్, అత్యవసర బ్రేకింగ్ వ్యవస్థ, ఎంత శబ్దం వస్తుంది, కదలికలు (వైబ్రేషన్), ఎలక్ట్రో మాగ్నటిక్ కంపాటబిలిటీ, మెట్రో సమాచార వ్యవస్థ, ఈవెంట్ రికార్డర్, ప్యాసింజర్ అడ్రెసింగ్, లైటింగ్, డోర్స్ టెస్ట్, ఎయిర్ కండిషనింగ్, అత్యవసర వేళలో రెస్క్యూ ఆపరేషన్ వంటి అంశాలను వయడక్ట్పై తిరిగే రైళ్లలో పరీక్షిస్తారు.
అంతా సిద్ధం: మెట్రో రైల్లో ప్రయాణించిన గవర్నర్, కేటీఆర్(పిక్చర్స్)
సిగ్నలింగ్ సన్నద్ధత..
సిగ్నలింగ్, ట్రయిన్ కంట్రోలింగ్, సమాచార మార్పిడి (కమ్యూనికేషన్), విద్యుత్తు వంటి అతిముఖ్యమైన వ్యవస్థల పనితీరును కూడా టెస్ట్, ట్రయల్ రన్స్లో పరీక్షిస్తారు. అనంతరం మెట్రోలో చదరపు మీటర్ వైశాల్యంలో 8 మంది ప్రయాణికులకు సరిపడే బరువున్న ఇసుక బస్తాలు వేసి పనితీరును అంచనా వేస్తారు. సరిగ్గా స్టేషన్లో మార్క్ చేసిన ప్రాంతంలో ఆగుతుందా లేదా? తలుపులు తెరుకుంటున్నాయా లేదా వంటివన్నీ పరీక్షిస్తారు.
ఆ నాలుగు అంశాలే కీలకం..
టెస్ట్ రన్ పూర్తయ్యాక ట్రయల్లో షెడ్యూల్ ప్రకారం ఒకదాని వెనక ఒకటి మెట్రో పరుగులు తీస్తాయి. ప్రయాణికులు ఉన్నప్పుడు ఎలా వెళుతుందో ప్రయాణికులు లేకుండా కూడా అలాగే అటు ఇటు నిర్దేశించిన వేళల్లో నడిపిస్తారు. నిర్దేశించిన సమయం రైళ్లు తిరగాల్సి ఉంటుంది. దీన్నే బర్నింగ్ పీరియడ్ అంటారు. ఆ సమయంలో పరీక్షలతో పాటూ నిర్వహణ, భద్రతను పరీక్షిస్తారు. దీన్ని మెట్రో పరిభాషలో ర్యాప్స్ అంటారు. విశ్వసనీయత (రిలయబులిటీ), అందుబాటులో ఉండడం (అవైలబులిటీ), నిర్వహణ (మెయింటయినబులిటీ), భద్రత (సేఫ్టీ)లను కలిసి ఆర్ఏఎంఎస్ (ర్యాప్స్)గా పరిగణిస్తారు. ట్రయల్ రన్లో ఈ నాలుగు అంశాలే కీలకం. అనంతరం నిర్మాణ సంస్థ సిద్ధంగా ఉన్నట్లు కమిషనర్ ఆఫ్ మెట్రో రైలు సేఫ్టీ (సీఎంఆర్ఎస్) నివేదిక సమర్పిస్తే వారి బృందం వచ్చి తనిఖీలు నిర్వహించి భద్రతా ధ్రువీకరణపత్రం ఇస్తుంది. ఆ తర్వాత మెట్రో ప్రయాణికులతో పరుగులు తీసేందుకు అనుమతి వచ్చినట్లే. నవంబర్ 28న ప్రారంభం కానున్న నేపథ్యలో మెట్రో పరీక్షలన్నీ చకచకా జరిగిపోతున్నాయి. స్టేషన్ల పనులు కూడా స్పీడందుకున్నాయి.