గోల్కొండలో కాల్పులు: రియల్ ఎస్టేట్ గొడవలే కారణమా?
హైదరాబాద్: హైదరాబాదులోని గోల్కొండ పోలీసుస్టేషను పరిధిలో కాల్పుల ఘటన కలకలం రేపింది. కాంగ్రెస్ నాయకుడు జబేర్ పటేల్ తనను బెదిరించాడని ఫరీద్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడని ఫరీద్ ఆరోపించారు.
రియల్ ఎస్టేట్ గొడవలే ఈ కాల్పులకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ వ్యవహారంలో గొడవలు చోటు చేసుకోవడం వల్లనే జబేర్ పటేల్ ఫరీద్పై ఆగ్రహంతో మూడు రౌండ్లు కాల్పులు జరిపారని పోలీసులు భావిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
హైదరాబాద్లో శుక్రవారంనాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముదిగొండ మండలం గోకినపల్లిలో ఆటో-లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ముగ్గురికి తీవ్రమైన గాయాలయ్యాయి. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన వద్దకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కామారెడ్డిలో చైన్ స్నాచింగ్
నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డిలోని అశోక్నగర్ కాలనీలో దుండగులు మహిళ మెడ నుంచి 5 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విమానాశ్రయంలో బంగారం స్వాధీనం
హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ తనిఖీలు నిర్వహించారు. దుబాయ్ నుంచి శంషాబాద్ వస్తున్న ఓ ప్రయాణికుడి నుంచి 430 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. తన వెంట తెచ్చుకున్న బ్యాగ్కు బటన్స్ రూపంలో బంగారాన్ని అమర్చి తీసుకువస్తుండగా తనిఖీలు జరిపి అధికారులు పట్టుకున్నారు.