నిద్ర నటిస్తున్న అధికారులు: ప్రజాప్రతినిధులపై సందేహాలు.. కబ్జా కోరల్లో ఖాజాకుంట
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర శివారుల్లోని కూకట్ పల్లి పరిధిలోని ఖాజాకుంట భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రియల్టర్లకు స్థానిక ప్రజాప్రతినిధుల మద్దతు ఉన్నదని సందేహాలు వ్యక్తం అవుతున్నా
హైదరాబాద్: గత రెండేళ్లుగా.. ఇంతకుముందు 2001లో భారీ వర్షాలు వచ్చినప్పుడు హైదరాబాద్ నగర శివారుల్లోని కాలనీలన్నీ నీట మునిగాయి. ఇటీవల మేడ్చల్ జిల్లా పరిధిలోని నల్ల చెరువుకు గండి పడటంతో హబ్సిగూడ, మల్కాజిగిరి, ఉప్పల్, నాచారం తదితర ప్రాంతాలన్నీ దాదాపు రెండు రోజుల పాటు పూర్తిగా జల ప్రవాహంలో చిక్కుబడి పోయాయి. దీనికి కారణమేమిటంటే ఆయా ప్రాంతాల్లో గల కుంటలు, చెరువులను రియల్టర్లు, వారికి దన్నుగా నిలిచే రాజకీయ వేత్తలు పూడ్చివేసేందుకు పూనుకున్నారు.
అందుకు అధికార పార్టీల నేతల అండదండలు పుష్కలంగా లభించాయి. ఇటీవలి కాలంలో ఉత్సాహం పెరిగి బతుకమ్మ పండుగ జరుపుకునేందుకు తాత్కాలికంగా చెరువు కోసం తవ్వకాలు జరిపితే 'ఆంజనేయస్వామి' విగ్రహం బయటపడింది. ఇదేదో మహాత్యంగా భావించి బోడుప్పల్ ప్రాంతంలో గుడి కట్టించారు. మాదాపూర్ దుర్గం చెరువు వద్ద ప్రముఖ సినీ నటుడు 'ఎన్ - కన్వెన్షన్ సెంటర్' విషయంంలో కూడా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
ఇటువంటివి హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్నాయి. అంతెందుకు ఇప్పుడు భాగ్యనగరానికి ఖ్యాతిగా పేరొందిన నెక్లెస్ రోడ్డు కూడా 'హుస్సేన్ సాగర్' పరిసరాలను కబ్జా చేయడం ద్వారా వచ్చిందే తప్ప మరొకటికాదు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా కబ్జాలపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటనలు చేస్తున్నా, ఆచరణలో జరుగుతున్నది విరుద్దమని పరిణామాలు చెప్తున్నాయి. తాజాగా కూకట్పల్లిలోని ఖాజాకుంటను కబ్జాదారులు ఖతం చేసే ప్రయత్నిస్తున్నారు.
గతంలో ఖాజాకుంట కబ్జాకు విఫలయత్నం
గతంలో పలుసార్లు పూడ్చివేతలకు పాల్పడడడంతో స్థానికులు, కుంట పరిరక్షణ కమిటీ సభ్యులు అడ్డుపడితే వెనుకంజ వేశారు. కానీ ఈసారి కబ్జాదారులు మరింత బరి తెగించారు. రెండు రోజుల క్రితం పట్టపగలే ఎక్స్కవేటర్, ట్రాక్టర్లతో మట్టిని కుంటలో నింపి కబ్జాచేసేందుకు ప్రయత్నించిన సంగతి రెవెన్యూ అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం గమనార్హం. చెరువుల పరిరక్షించేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నా కబ్జాదారులు యథేచ్ఛగా చెరువులు, కుంటలను ఆక్రమిస్తూనే ఉంటున్నారన్నదానికి ఇదో నిదర్శనం. ఇందుకు స్థానిక రెవెన్యూ అధికారుల సహకారం లేకుండా జరగదని స్థానికులు అనుమానిస్తున్నారు. చెరువును పట్టపగలే పూడ్చి వేస్తున్నారన్న సమాచారం అందుకున్నా అధికారులు పూడ్చివేతలను నిలిపివేసేందుకు ప్రయత్నించకపోవడంతో ప్రజల ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తోంది.
గతంలోనే రెండెకరాలకు పైగానే కబ్జా
కూకట్పల్లిలోని ఖాజాకుంట గ్రామ సర్వే నెంబర్ 440 లోని 8.17ఎకరాల విస్తీర్ణంలో ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం 8.17 ఎకరాల్లో విస్తరించి ఉన్నా, ప్రస్తుతం రెండెకరాలకు పైగా ఆక్రమణకు గురైనట్లు తెలిసింది. కొందరు వ్యక్తులు పక్కకాలనీలో విస్తరించి ఉన్న 441, 442, 443 ప్రైవేట్ సర్వే నంబర్లతో నమోదు చేసుకొని.. 440 సర్వే నంబర్ లోని ఖాజాకుంట స్థలం ఆక్రమించుకొంటున్నారు. విషయం తెలుసుకొన్న స్థానికులు కుంటను పరిరక్షించుకొనేందుకు కుంట పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు పోరాడి కుంటను రక్షించే యత్నం చేస్తున్నా.. రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. పెద్దఎత్తున మట్టిని తీసుకొచ్చి చెరువులో నింపుతూ స్థలాన్ని కాజేస్తున్నారు.
ఖాజాకుంట పరిరక్షణపై ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం
చెరువులు, కుంటలు కబ్జాకు గురవుతున్నా, ప్రజా ప్రతినిధులు మాత్రం మిన్నకుండిపోతున్నారు. ఒక పక్క రెవిన్యూ అధికారులు.. మరో పక్క ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో చెరువులను పరిరక్షించు కోవాలన్న ప్రభుత్వ లక్ష్యానికి గండి పడుతోంది. 2014 వరకు అప్పటి ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ సహకారంతో కుంటను కబ్జాకాకుండా కాపాడుకోగలిగిన కుంట పరిరక్షణ సమితి సభ్యులు.. ఆ తర్వాత నుంచి కుంటను రక్షించుకొనేందుకు పోరాడుతున్నా.. ఫలితం దక్కడంలేదు. ఇందుకు ఖాజాకుంట ఆక్రమణపై స్థానిక ఓ ప్రజాప్రతినిధికి దగ్గరైన ఓ బిల్డర్ హస్తం ఉన్నట్లు స్థానికులు, కుంట పరిరక్షణ సమితి సభ్యులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
రాజకీయ ప్రోద్భలంతో కేసులు పెడుతున్న అధికారులు.. పట్టపగలే యథేచ్ఛగా జరుగుతున్న కబ్జా బాగోతంపై ఎందుకు స్పందించడం లేదని చెరువుల పరిరక్షణ సమితి సభ్యులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల మైసమ్మ చెరువును కాజేసే ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులపై రాజకీయ ప్రోద్భలంతో అధికారులు కేసులు నమోదు చేసి జైలుకు పంపిన అధికారులు ఖాజాకుంట విషయంలో మాత్రం ఎందుకు పట్టించుకో వడంలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
రెవెన్యూ అధికారుల స్పందన కరువు
చెరువు పరిరక్షణ పేరుతో ఏర్పాటు చేసిన కమిటీ ఖాజాకుంటను రక్షించేందుకు శక్తివంచనలేని పోరాటం చేస్తోంది. పదేళ్లుగా పరిరక్షణ కమిటీ సభ్యులు కుంట కబ్జాకాకుండా అడ్డుకొంటూనే ఉన్నారు. కానీ కబ్జాదారుల్లో ప్రముఖ వ్యక్తులు ఉండడంతో కమిటీ సభ్యుల ప్రయత్నాలు పూర్తిస్థాయిలో ఫలించడంలేదు.కుంట పూడ్చివేత పనులు మొదలు పెట్టడంతో స్థానికులు, కుంట పరిరక్షణ సమితి సభ్యులు, రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
స్థానికులు, కుంట పరిరక్షణ కమిటీ సభ్యులు స్థానిక తహసీల్దార్కు ఫోన్లో ఫిర్యాదు చేయడం తోపాటు మట్టి పూడుస్తున్న ఫొటోలను కూడా పంపారు. కానీ అధికారులు స్పందించలేదని వారు పేర్కొన్నారు. కుంట కబ్జాకు గురవుతున్నట్లు అనేకమార్లు ఫిర్యాదు చేశామని, కానీ అధికారులు పట్టించుకోవడంలేదని ఖాజాకుంట పరిరక్షణ సమితి అధ్యక్షుడు వై పద్మయ్య ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందించి కుంటలో ఆక్రమణలను తొలగించి, ఇప్పటికే కబ్జాకు గురైన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించి వెంటనే కుంటలోని ఆక్రమణలను తొలగించి చుట్టూ ఫెన్సింగ్ వేయాలని ఖాజాకుంట పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి రామచంద్రరాజు చెప్పారు. గతంలో వేసిన ఫెన్సింగ్నూ తొలగించారని, మళ్లీ ఫెన్సింగ్ పునరుద్ధరించి ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.