మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ డిజాస్టర్.. ఈ ఫెయిల్యూర్కి కారణమెవరు? పార్టీలో అసలేం జరిగింది..
Recommended Video
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బ కొట్టాయి. టీఆర్ఎస్ హవా మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో ఉనికి కోసం అగచాట్లు పడుతోంది కాంగ్రెస్. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి అధికార పార్టీ మెడలు వంచాలని ప్రయత్నిస్తున్నా.. నాయకత్వ శక్తి మాత్రం సరిపోవట్లేదు. తాజా మున్సిపల్ ఫలితాల్లోనూ అదే రిపీట్ అయింది. ఇప్పటివరకు అందుతున్న ట్రెండ్స్ ప్రకారం.. కేవలం మూడంటే మూడు స్థానాలకే మాత్రమే కాంగ్రెస్ పరిమితమైన పరిస్థితి. టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకనే పార్టీ.. కనీస పోటీని కూడా ఇవ్వలేక చేతులెత్తేయడం ఆ పార్టీ నేతలను తల ఎత్తుకోలేకుండా చేస్తోంది. ఒక్క పార్లమెంట్ ఎన్నికలు మినహా.. అసెంబ్లీ ఎన్నికలు,స్థానిక సంస్థల ఎన్నికలు,మున్సిపల్ ఎన్నికలు.. ఇలా ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ పుంజుకోలేకపోయింది.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు : మంత్రి కేటీఆర్ ఇలాఖాలో టీఆర్ఎస్కు రెబల్స్ షాక్..
వెలవెలబోతున్న గాంధీభవన్..
తాజా ఫలితాలతో హైదరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ వైపు చూసేవారే కరువయ్యారు. ఏకంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా ఎంపీ రేవంత్ రెడ్డి,సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితర అగ్ర నేతల నియోజకవర్గాల్లోనూ పార్టీ మట్టి కరవడం ఘోర పరాభవమనే చెప్పాలి. ఎన్ని ఎన్నికలు వస్తున్నా.. పోతున్నా.. కాంగ్రెస్ మాత్రం ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవట్లేదన్న విమర్శలే వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితికి అదే కారణమన్న బలమైన వాదన వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమినే సరిగ్గా సమీక్షించుకోలేకపోయిన కాంగ్రెస్.. తాజా ఓటమిని ఎంతవరకు సమీక్షించుకుని చక్కదిద్దుకుంటుందన్నది ప్రశ్నార్థకమే అంటున్నారు.
ఫెయిల్యూర్కి కారణమెక్కడ..
టీపీసీసీ చీఫ్ పదవి నుంచి త్వరలోనే తప్పుకుంటానని ఉత్తమ్ కుమార్ రెడ్డి బాహాటంగానే చెప్పేశారు. పార్టీలో తదుపరి పీసీసీ చీఫ్ ఎవరన్న చర్చ జరుగుతోంది. అయితే పీసీసీ చీఫ్ చర్చపై పెట్టినంత ఫోకస్ మున్సిపల్ ఎన్నికలపై నేతలు పెట్టలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉత్తమ్కు పీసీసీ చీఫ్గా ఇవే ఆఖరి ఎన్నికలు కావడంతో ఆయన లైట్ తీసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు విజయం సాధించినా.. అది ఉత్తమ్ ఖాతాలోకే వెళ్తుందన్న ఉద్దేశంతో మిగతా నేతలు కూడా పెద్దగా కృషి చేయలేదన్న చర్చ జరుగుతోంది.
సమీక్షలు, సమావేశాలు జరిగాయా..
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓవైపు అధికార పార్టీ రెగ్యులర్గా సమీక్షలు,సమావేశాలు నిర్వహిస్తున్నా.. కాంగ్రెస్లో మాత్రం అలాంటివేమీ జరగలేదు. కేవలం అభ్యర్థుల ఎంపిక,మేనిఫెస్టో చర్చల కోసం డీసీసీ కమిటీలతో చర్చలు జరిపారు. అలాగే పార్టీకి మూల స్తంభాలుగా చెప్పుకునే సీనియర్ నాయకులు కూడా ఎన్నికల క్షేత్రంలో ఎక్కడా కనిపించిన దాఖలా లేదంటున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ నాయకత్వం వహిస్తున్న నల్గొండ,భువనగిరి మినహా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేదు.
ఎవరికే వారే అన్న ధోరణి
కాంగ్రెస్లో నాయకత్వ లోపం.. అంతర్గత విభేదాల కారణంగానే నేతలంతా ఒక్క తాటి పైకి వచ్చి పనిచేయలేకపోతున్నారన్న విమర్శ ఉంది. ఓవైపు టీఆర్ఎస్ తరుపున మంత్రులు,అగ్ర నేతలంతా ఎన్నికల క్షేత్రంలో గెలుపు కోసం కృషి చేస్తే.. కాంగ్రెస్లో మాత్రం ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరించారన్న విమర్శ కూడా ఉంది. ప్రజలకు అధికార పార్టీపై విసుగెత్తి కాంగ్రెస్కు ఓటేయాలే తప్ప.. కేసీఆర్ లాంటి ఛరిష్మా ఉన్న నాయకులు ఆ పార్టీలో ఎక్కడని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్టు.. కాంగ్రెస్ ఓటమికి ప్రతీసారి వంద కారణాలు కనిపిస్తూనే ఉంటాయి. వీటన్నింటిని అధిగమించి ఆ పార్టీ తెలంగాణలో ఎప్పుడు పుంజుకుంటుందో వేచి చూడాల్సిందే.