భరత్ నగర్ ఫ్లైఓవర్పై కారు ప్రమాదం : ప్రమాదానికి అసలు కారణమదే..
హైదరాబాద్ మూసాపేట పరిధిలోని భరత్నగర్ ఫ్లైఓవర్పై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రమాద కారణాలపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. కారులో ఉన్న ఆరుగురిలో ఏ ఒక్కరూ మద్యం సేవించలేదని నిర్దారించారు. అయితే ప్రమాదానికి అసలు కారణమేంటన్న దానిపై ప్రత్యక్ష సాక్షులు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ప్రమాదానికి కారణమదే..
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. రాత్రి 2గంటల సమయంలో భరత్నగర్ ఫ్లైఓవర్ నిర్మానుష్యంగా ఉన్న సమయంలో దాదాపు 120కి.మీ వేగంతో ఓ కారు దూసుకొచ్చింది. కారులో ఉన్న ఆరుగురు మిత్రులు.. లోపల గోల గోల చేస్తున్నారు. ఒకరిపై ఒకరు సెటైర్స్ వేసుకుంటూ అరుస్తున్నారు. అందరూ క్లోజ్ ఫ్రెండ్స్ కావడంతో.. వారి అల్లరి శృతిమించింది. స్నేహితుల గొడవలో పడ్డ సునీల్.. డ్రైవింగ్పై నియంత్రణ కోల్పోయాడు. దాంతో కారు ఒక్కసారిగా ఫుట్పాత్ పైకి ఎక్కి రెయిలింగ్ను ఢీకొట్టింది. రెయిలింగ్ విరిగిపోవడంతో ఫ్లైఓవర్పై నుంచి కారు పెద్ద శబ్దంతో జేసీబీపై పడిపోయింది.
బాంబు పేలిందనుకున్నారు..
ఫ్లైఓవర్పై నుంచి కారు పడటంతో ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది. సమీపంలోని మార్కెట్ వద్ద ఉన్న రైతులు,విద్యుత్ పనులు చేస్తున్న కార్మికులు,ఆ సమయంలో రోడ్డుపై సంచరిస్తున్న కొంతమంది.. ఆ శబ్దానికి భయంతో పరుగులు పెట్టారు. అనంతరం నుజ్జునుజ్జయిన కారును జేసీబీ సాయంతో బయటకు తీశారు. అప్పటికే సొహైల్ అనే యువకుడు మృతి చెందినట్టు గుర్తించారు. మిగతా క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించారు.
మద్యం సేవించలేదు..
మద్యం సేవించడం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చునని అక్కడున్నవారు భావించారు. కానీ పోలీసుల పరిశీలనలో వారెవరూ మద్యం సేవించలేదని తేలింది. మృతులను సునీల్(22),మహ్మద్ సొహైల్(27),మోహిజ్(19),ఇర్ఫాన్(18),అశ్వక్(18)గా గుర్తించారు. వీరందరి పేద కుటుంబ నేపథ్యమే. అర్ధరాత్రి తర్వాత నగరంలో కారులో షికారు కొట్టాలని బయలుదేరి ప్రమాదానికి గురయ్యారు.
Recommended Video
మాదాపూర్లో బిర్యానీ తిని..
ప్రమాదానికి ముందు హైటెక్ సిటీలోని ఓ హోటల్లో స్నేహితులంతా కలిసి బిర్యానీ తిన్నారు. అక్కడి నుంచి బాలానగర్ చౌరస్తాకు వచ్చి ఛాయ్ తాగారు. రాత్రి 2.10గం. సమయంలో మూసాపేట వైపు నుంచి భరత్ నగర్ ఫ్లైఓవర్ పైకి చేరుకున్నారు. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే ప్రమాదానికి గురయ్యారు. అయితే కారు ఫ్లైఓవర్ పైనుంచి నేరుగా కింద పడకుండా జేసీబీపై పడటంతో ప్రమాద తీవ్రత తగ్గిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నేరుగా కింద పడి ఉంటే.. గాయాలైన ఆ ఐదుగురు కూడా మృతి చెందేవారని అంటున్నారు.