కేసీఆర్కు షాక్, టీడీపీలో చేరిక: వారికి టిక్కెట్లా.. టీఆర్ఎస్ అసంతృప్తుల ఎదురుదాడి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు అసంతృప్తుల బెడద ప్రారంభమైంది. పలువురు నేతలు తమకు టిక్కెట్లు రాకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారిలో కొందరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్తో పొత్తు, తెలుగుదేశంకు ఉన్న కేడర్ నేపథ్యంలో టీడీపీ నుంచి పోటీ చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.
చదవండి: తెలంగాణపై చంద్రబాబు 'బిగ్' ప్లాన్: కాంగ్రెస్ గెలిస్తే అధికారంలోను భాగస్వామ్యం
ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గానికి టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ తిరుగుబావుటా ఎగురవేశారు. తనకు టిక్కెట్ రాకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేసీఆర్ ఖానాపూర్ వచ్చి పోటీ చేసినా తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తాను ఎట్టి పరిస్థితుల్లో పోటీలో నిలబడతానని చెప్పారు.
చదవండి: కేసీఆర్ తర్వాత తెలంగాణలో ఏపీ సీఎం రికార్డ్!: చంద్రబాబుకు ఉత్తమ్ 15 సీట్లు ఆఫర్
ఓట్లు మావి, సీట్లు స్థానికేతరులకా?
టిక్కెట్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని రమేష్ రాథోడ్ శనివారం ఉట్నూరులో భారీ నిరసన ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించారు. తనకు టిక్కెట్ ఇస్తానని పార్టీలో చేర్చుకున్నారని చెప్పారు. ఇప్పుడు తనను తెరాస నేతలు మోసం చేశారన్నారు. తనకు టికెట్ ఇవ్వకున్నా బాధలేదని, కానీ స్థానికేతరులకి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఓట్లు మావి సీటు స్థానికేతరులకా అన్నారు.
టీడీపీలోకి మొవ్వ సత్యనారాయణ
తెరాస నేత మొవ్వ సత్యనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. శనివారం చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ రాగా చాలామంది ఆశావహులు తరలి వచ్చారు. తాము పోటీ చేస్తామని దరఖాస్తులు పెట్టుకున్నారు. దాదాపు 60 మంది విజ్జాపనలు పెట్టుకున్నారని తెలుస్తోంది. గతంలో టీడీపీని వీడిన వారు కూడా ఇప్పుడు తిరిగి వచ్చే అవకాశముందని అంటున్నారు. అలా వచ్చే వారిని చేర్చుకునేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. పొత్తులతో టీడీపీ లాభపడాలని చంద్రబాబు అంటున్నారు. టీడీపీకి ఇప్పటికీ 30 నుంచి 60 సీట్లలో మంచి బలం ఉందని చెబుతున్నారు. మహబూబాబాద్ టికెట్ రాకపోవడంతో టీఆర్ఎస్ నేత మోహన్లాల్ టీఆర్ఎస్కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు.
Recommended Video
కొండా సురేఖ, సత్యవతి రాథోడ్ అసంతృప్తి
తమకు వరంగల్ తూర్పు సీటు కేటాయించనందుకు ఇప్పటికే కొండా సురేఖ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. డోర్నకల్ను తాజా మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్కు కేటాయించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ శనివారం కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఆమెకు టికెట్ ఇస్తేనే పార్టీలో పని చేస్తామని పలువురు తేల్చేశారు. ఎల్లారెడ్డి టిక్కెట్ ఆశించిన జనార్ధన్ రెడ్డి అది రాకపోవడంతో పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు.
మరెందరో అసంతృప్తులు
మహబూబాబాద్ టికెట్ను తాజా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్కు కేటాయించడంపై టీఆర్ఎస్ నేత రాజవర్ధన్ నేతృత్వంలో కార్యకర్తలు ఆవేదన సభ నిర్వహించారు. అభియోగాలు ఉన్న శంకర్ నాయక్కు టిక్కెట్ సరికాదన్నారు. పార్టీ మార్పుపై కార్యకర్తల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. వైరా టిక్కెట్ తాజా మాజీ మదన్ లాల్కు ఇవ్వడంపై బొర్రా రాజశేఖర్, మరో ఇద్దరు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రామగుండం టిక్కెట్ సోమారపు సత్యనారాయణకు ఇవ్వడంపై జెడ్పీటీసీ సంధ్యారాణి అసంతృప్తితో ఉన్నారు. ఓ కార్యకర్త కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. భూపాల్ రెడ్డికి నారాయణఖేడ్ ఇవ్వడాన్ని పలువురు జెడ్పీటీసీలు, ఇతర నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆయనను మార్చకుంటే పార్టీని వీడుతామని అల్టిమేటం జారీ చేశారు. జూబ్లీహిల్స్ టిక్కెట్ మాగంటిగోపినాథ్కు ఇవ్వడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు.
బొంతు రామ్మోహన్కు టిక్కెట్ ఇవ్వాలని
మేయర్ బొంతు రామ్మోహన్ ఉప్పల్ టిక్కెట్ ఆశించారు. ఆయనకు ఇవ్వకపోవడంపై పలువురు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బేతి సుభాష్ రెడ్డికి బదులు బొంతుకు ఇవ్వాలని పలువురు డిమాండ్ చేశారు. కేటీఆర్కు విజ్జప్తి చేశారు. అభ్యర్థి మార్పుపై చర్చించే అవకాశముందని తెలుస్తోంది.