కూటమిలో వెనక్కి తగ్గిన రెబల్స్..! శేరిలింగంపల్లి రూట్ క్లియర్ చేసిన కాంగ్రెస్, టీడిపి..!!
హైదరాబాద్ : తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసింది. మహాకూటమిలో దాదాపు రెబల్స్ బెడద లేకుండా జాగ్రత్త పడ్డారు ముఖ్యనేతలు. ప్రదానంగా శేరిలింగంపల్లి నియోజక వర్గంలో నెలకొన్న ఉత్కంఠతకు తెర పడింది. శేరిలింగంపల్లి లో రెబల్ గా నామినేషన్ వేసిని మువ్వా సత్యనారాయణ, బిక్షపతియాదవ్ ల నామినేషన్ లను ఉపసంహరింపజేసారు. దీంతో కూటమి తరుపున పోటీ చేస్తున్న భవ్య ఆనంద్ ప్రసాద్ కు రూట్ క్లియర్ చేసారు అదిష్టానం నేతలు.
కూటమికి గ్రేటర్ లో నో రెబల్స్..! బుజ్జగించడంలో విజయం సాధించిన ముఖ్యనేతలు..!!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అత్యంత కీలకమైన నియోజకవర్గం శేరిలింగంపల్లి. అన్నింటితో పోలిస్తే ఇక్కడ సెటిలర్లు ఎక్కువగా ఉండడంతో ఈ నియోజవర్గం ప్రత్యేకమైనదిగా చెప్పుకుంటారు. ఎన్నికలకు సమయం దగ్గరపడడంతో శేరిలింపల్లి నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. వీరి ప్రచారంతో రోజురోజుకూ రాజకీయం వేడెకుతోంది. టీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే గాంధీ, మహాకూటమి నుంచి టీడీపీ అభ్యర్థి వెనిగెళ్ల ఆనందప్రసాద్, బీజేపీ నుంచి యోగానంద్లు పార్టీ కార్యకర్తలతో ప్రచారంలో పాల్గొంటున్నారు.
అదికార పార్టీలో కూడా రెబల్స్..! కేటీఆర్ జోక్యంతో చల్లారిన అసంత్రుప్తులు..!
ఒకపక్క బైక్ ర్యాలీలు, మరో పక్క పాదయాత్రలతో నియోజకవర్గంలో ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో రెబెల్స్ బెడద ఆ రెండు పార్టీలను కుదిపేస్తుంది. టీఆర్ఎస్ నుంచి మొదట్లో టికెట్ ఆశించి భంగపడ్డ కార్పొరేటర్ జగదీశ్వర్గౌడ్, చిన్నచిన్న బేధాభిప్రాయాలతో అలిగిన కార్పొరేటర్లను నియోజకవర్గ ఇన్చార్జీగా ఉన్న పోచారం శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ సమ్మతి సెగలను చల్లార్చారు. ఇక టికెట్ విషయంలో టీడీపీ అభ్యర్థి ఆనందప్రసాద్కు సొంత పార్టీతో పాటు కాంగ్రెస్ నుంచీ పోటీ ఉండడంతో, ఆ రెండు పార్టీలకు చెందిన ఇద్దరు నేతలు రెబెల్స్గా నామినేషన్ వేశారు.
మువ్వాకు నచ్చజెప్పిన బాబు..! భవ్యాకు సపోర్ట్ చేస్తాన్న సత్యనారాయణ..!!
టీడీపీ తరపున మొవ్వా సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్ నామినేషన్ వేశారు. దీంతో వీరిని బుజ్జగించేందుకు రెండు పార్టీల అధిష్ఠానాలు ప్రయత్నాలు జరుపుతున్నాయి. ఇందులో భాగంగానే భిక్షపతియాదవ్తో ఆ పార్టీ అధిష్టానం, మాజీ కేంద్రమంత్రి జైపాల్రెడ్డితో రెండు రోజుల నుంచి మంతనాలు జరుపుతుంది. బుధవారం ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా భిక్షపతియాదవ్ తో చర్చలు జరిపి విరమింప చేసారు
కథ సుఖాంతం..! గెలుపుపై ద్రుష్టి సారించిన అభ్యర్థులు..!!
మరో పక్క రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన టీడీపీ నాయకుడు మొవ్వా సత్యనారాయణను ఏపీ సీఎం, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా అమరావతికి పిలిచి మాట్లాడారు. మొవ్వా భవిష్యత్కు భరోసా ఇవ్వడమే కాకుండా అరగంటపాటు ఆయన చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకుని వెంటనే మొవ్వాను ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. ఈ రెండు పార్టీల జోక్యంతో టీడీపీ అభ్యర్థికి లైన్ క్లియర్ అయినట్లైంది. అధిష్టానాలు జోక్యం చేసుకునప్పట్టికీ వీరిరువురూ గురువారం రెబెల్ అభ్యర్థులుగా వేసిన నామినేషన్లు ఉపసంహరించుకుంటేనే ఆ పార్టీలు కష్టకాలం నుంచి బయటపడే అవకాశాలు కనిపిస్తాయి.