ప్రగతి పథంలో తెలంగాణ ... కానీ ఆర్థికమాంద్యం ప్రభావం చూపిందన్న కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణ పూర్తిస్థాయి బడ్జెట్ను సీఎం కేసీఆర్ ప్రవేశఫెట్టారు. అసెంబ్లీలో రెండోసారి కాసేపటి క్రితం పద్దును ప్రవేశపెట్టారు. సీఎంగా రెండోసారి కేసీఆర్ బడ్జెట్ ప్రవేశఫెట్టారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓట్ ఆన్ అకౌంట్ పద్దు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొందని పేర్కొన్నారు కేసీఆర్. కానీ ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్తుందని చెప్పారు. కానీ దేశంలో నెలకొన్న ఆర్థికమాంద్యం రాష్ట్రంపై కూడా పడిందని గుర్తుచేశారు కేసీఆర్.
రాష్ట్ర స్థూల దేశీయోత్పత్పి పెరగడం సానుకూల అంశమని పేర్కొన్నారు సీఎం కేసీఆర్. గత ఐదేళ్లలో రాష్ట్ర సంపద గణనీయంగా పెరిగిందన్నారు. జీఎస్జీడీ 8 లక్షల 68 కోట్లు నమోదైందని గుర్తుచేశారు. మరోవైపు ఉమ్మడి రాష్ట్రంలో మూలధన వ్యయం తక్కువగా ఉండేదని గుర్తుచేశారు. 11.2 శాతం ఉండేదని తెలిపారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితి మారిపోయిందన్నారు. క్రమంగా పెరిగి 16.9 శాతానికి చేరి .. దేశంలో ముందువరుసలో ఉందని తెలిపారు.
సమైక్య పాలనలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. కానీ గత ఐదేళ్లలో కేటాయింపులు భారీగా పెరిగాయని చెప్పారు. మూలధన వ్యయం లక్షా 65 వేల కోట్లకు చేరిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏడాదికి 5 వేల కోట్లు ఖర్చు చేస్తే .. తెలంగాణ రాష్ట్రంలో 33 వేల కోట్లు వ్యయం చేస్తున్నామని పేర్కొన్నారు. అంతేకాదు పెట్టుబడి రేటు ఆరు రేట్లు పెరిగిందని చెప్పారు.
సమర్థవంతమైన ఆర్థిక నిబంధనల వల్ల రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్తుందన్నారు కేసీఆర్. నిరంతరం విద్యుత్ సరఫరా చేయడంలో వల్ల పరిశ్రమలకు మరింత ఊతమిచ్చామని గుర్తుచేశారు. వ్యవసాయరంగానికి కూడా పవర్ ఇవ్వడం వల్ల పంటలకు మేలు జరిగిందని వివరించారు. మరోవైపు ఐటీ, సేవా రంగాల్లో కూడా గణనీయమైన మార్పులు లభించాయని పేర్కొన్నారు. ప్రగతికాముక విధానాల వ్యవసాయం వృద్ధి 6.3 శాతానికి చేరిందన్నారు. 2018 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 8.1 శాతానికి చేరిందన్నారు. పారిశ్రామిక రంగంలో కూడ 5 శాతం వృద్ధి సాధించామని పేర్కొన్నారు