రికార్డింగ్ డ్యాన్సులు-టీఆర్ఎస్ నేత ఇంట్లో యువతుల నృత్యాలు-లాక్డౌన్ ఆంక్షలు బేఖాతరు
వికారాబాద్ టీఆర్ఎస్ నేత ఒకరు లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారు. ఏకంగా రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేసి వందల మందిని ఆహ్వానించారు. డీజే పాటలతో,యువతుల నృత్యాలతో హోరెత్తించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలుచేస్తున్నామని చెబుతున్న పోలీసులు... కొన్నిచోట్ల ఇలా చూసీ చూడనట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించేవారు ఎంతటివారైనా శిక్ష పడాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
'రేవ్ పార్టీ'ని మించి-కడ్తాల్ ఫాంహౌస్లో రెచ్చిపోయిన జంటలు-వెలుగులోకి సంచలన విషయాలు
మొగులయ్య అనే నేత ఇంట్లో
వికారాబాద్ జిల్లా దోమ మండలం దిర్సంపల్లికి చెందిన మొగులయ్య అనే టీఆర్ఎస్ నాయకుడు గ్రామంలోని తన ఇంట్లో రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేశాడు. రాత్రిపూట ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వందల మందిని ఆహ్వానించి విందు కూడా ఏర్పాటు చేశాడు. లాక్డౌన్ నిబంధనలు కొనసాగుతున్న సమయంలో రాత్రిపూట రికార్డింగ్ డ్యాన్సుల కార్యక్రమేంటని చాలామంది ప్రశ్నిస్తున్నారు. సాయంత్రం 6గంటల తర్వాత ఎవరైనా బయట కనిపిస్తే జరిమానా విధించే పోలీసులు... ఈ రికార్డింగ్ డ్యాన్సులను మాత్రం ఎందుకు ఆపలేదని నిలదీస్తున్నారు. సదరు నేతపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆ గ్రామంలో కేసులు ఎక్కువగానే...
నిజానికి దిర్సంపల్లి గ్రామంలో కరోనా కేసులు కూడా ఎక్కువే ఉన్నాయని చెబుతున్నారు. అదేమీ పట్టించుకోకుండా మొగులయ్య ఇలా రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేయడంపై స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొగులయ్య గతంలోనూ లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలుచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్,డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు పోలీసులు కఠినంగానే వ్యవహరిస్తున్నప్పటికీ అక్కడక్కడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
హైదరాబాద్ శివారులోనూ...
రెండు రోజుల క్రితం హైదరాబాద్ శివారులోని కడ్తాల్లో ఉన్న ఓ ఫాంహౌస్లోనూ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న బర్త్ డే పార్టీని పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. నిజానికి అది బర్త్ డే పార్టీ ముసుగులో జరుగుతున్న రేవ్ పార్టీగా పోలీసులు గుర్తించారు. అందులో పాల్గొన్న దాదాపు 70 మంది యువతీ,యువకులను అరెస్ట్ చేశారు. అనంతరం సొంత పూచీ కత్తుపై వారిని విడిచి పెట్టారు. పార్టీ ఏర్పాటు చేసిన వరుణ్ గౌడ్ అనే వ్యక్తి ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. ఇందులో పాల్గొన్నవారిలో బడా బాబుల పిల్లలు,సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.