హైదరాబాద్ ఆసుపత్రులు..ఆటంబాంబులు: 90 శాతం భవనాలకు నో ఫైర్ సేఫ్టీ: మంటలు చెలరేగితే గతేంటీ
హైదరాబాద్: విజయవాడ గవర్నరు పేటలోని హోటల్ స్వర్ణ ప్యాలెస్లో నెలకొల్పిన కోవిడ్ కేర్ సెంటర్లో సంభవించిన అగ్నిప్రమాదం.. రెండు తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. అగ్నిమాపక నిబంధనలను పాటించకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా భవనాలను నిర్మించుకున్నారనే విషయం వెల్లడయ్యేలా చేసింది. హైదరాబాద్లో 90 శాతం భవనాలకు అగ్నిమాపక వ్యవస్థ లేదని స్పష్టమైంది. అగ్నిప్రమాదాలు సంభవించడమంటూ జరిగితే.. బయటపడటానికి గల అవకాశాలు దాదాపు లేవంటూ ఓ ప్రముఖ జాతీయ వెబ్సైట్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
90 శాతం భవనాల్లో నో ఫైర్ సేఫ్టీ
రెండు తెలుగు రాష్ట్రాల వారు నాణ్యమైన వైద్యాన్ని చేయించుకోవాలంటే మొదటగా గుర్తుకొచ్చేది హైదరాబాదే. రాష్ట్ర విభజన చోటు చేసుకుని ఆరేడేళ్లు పూర్తయినప్పటికీ.. ఏపీలో నాణ్యమైన వైద్యాన్ని అందించే ఆసుపత్రుల సంఖ్య ఆశించిన స్థాయిలో లేకపోవడమే దీనికి కారణం. అలాంటి హైదరాబాద్లోని ఆసుపత్రి భవనాలకు ఫైర్ సేఫ్టీ లేదనే విషయాన్ని ఆ వెబ్సైట్ స్పష్టం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) రికార్డుల వివరాలను ఉటంకిస్తూ ఈ కథనాన్ని ప్రచురించింది.
అగ్నిమాపక వ్యవస్థ ఊసే లేదంటూ..
వందలాది రోగులు, వారి వెంట వచ్చే వారితో క్రిక్కిరిసిపోయే ఆసుపత్రుల భవనాల్లో అగ్నిమాపక వ్యవస్థ ఊసే లేదు. భవనాల చుట్టూ అగ్నిమాపక వాహనాలు వెళ్లే పరిస్థితులూ లేవు. దాదాపు 90 శాతం ఆసుపత్రులు వివిధ రకాల నిబంధనలను పాటించట్లేదని, ఈ విషయంలో జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ.. పెద్దగా ఫలితాలు రాలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నట్లు స్పష్టం చేసింది. స్వర్ణ ప్యాలెస్ తరహాలో ఏదైనా అగ్నిప్రమాదం చోటు చేసుకుంటే రోగులకు ముప్పు వాటిల్లడం తప్పకపోవచ్చనే పరిస్థితులు నెలకొందనే అభిప్రాయాలు ఉన్నాయి.
జీహెచ్ఎంసీ పరిధిలో 1700 ఆసుపత్రులు..
జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 1700 ఆసుపత్రులు ఉన్నాయని, వాటిల్లో 90 శాతం వరకు భవనాలకు సరైన అగ్నిమాపక వ్యవస్థ లేదని, ఫైర్ సేఫ్టీ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆ కథనం స్పష్టం చేసింది. ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించకపోతే సీజ్ చేస్తామంటూ 2018 అక్టోబర్లో ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) యూనిట్ నోటీసులను జారీ చేసిన తరువాతే..కొన్ని ఆసుపత్రులు సెల్ఫ్ డిక్లరేషన్ ఫారాలను అందజేశాయని పేర్కొంది. ఎన్ఓసీ కోసం ఈవీడీఎం యూనిట్ సెల్ఫ్ డిక్లరేషన్లను అందజేసినట్లు స్పష్టం చేసింది.
రెసిడెన్షియల్ ఏరియాల్లో
చాలా ఆసుపత్రులు రెసిడెన్షియల్ ఏరియాల్లో కొనసాగుతున్నాయని బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీకి చెందిన రిధిమా అనే మహిళ పేరును తన కథనంలో ఉటంకించింది. ఫలితంగా- ఆసుపత్రుల నుంచి వెలువడే వ్యర్థాల వల్ల అక్కడి వాతావరణం కలుషితమౌతోందనే అభిప్రాయాలు స్థానికుల్లో వ్యక్తమౌతున్నట్లు తేలిందని స్పష్టం చేసింది. రెసిడెన్షియల్ అవసరాల కోసం అనుమతులను తీసుకుని, ఆసుపత్రి భవనాలను కడుతున్నారని ఇలాంటివి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కోకొల్లులుగా ఉన్నాయని ఆ కథనం పేర్కొంది.