కోమటిరెడ్డి, సంపత్లకు ఊరట: హైకోర్టులో టీఆర్ఎస్కు ఎదురుదెబ్బ
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్లకు హైకోర్టులో ఊరట లభించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కోమటిరెడ్డి, సంపత్లు ఎమ్మెల్యేలుగా కొనసాగనున్నారు.
Recommended Video
కోమటిరెడ్డి, సంపత్ల సభ్యత్వ రద్దుపై గతంలో సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డివిజన్ బెంచ్లో అప్పీల్ చేశారు. అయితే వారి విజ్ఞాపనను హైకోర్టు తోసిపుచ్చింది. సింగిల్ బెంచ్ జడ్జి తీర్పును సమర్థించింది. కోమటిరెడ్డి, సంపత్లపై రాజకీయ దురుద్దేశ్యంతో అనర్హత వేటు వేశారని వాళ్ల తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.
కాగా, అసెంబ్లీ సమావేశాల సమయంలో హెడ్ ఫోన్స్ విసిరి దాడి చేసారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అయిన కోమటిరెడ్డి, సంపత్ల సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. ఇరువురి సభ్యత్వాల రద్దు చెల్లదని సింగిల్ బెంచ్ తీరప్పు ఇచ్చింది. వారిని ఎమ్మెల్యేలుగా కొనసాగించాలని వెల్లడించింది. దీనిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డివిజన్ బెంచ్కు వెళ్లగా అక్కడ కూడా చుక్కెదురైంది.