ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు జీతాలు చెల్లించాలి: విద్యుత్ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొద్ది నెలల క్రితం... రిలీవ్ చేసిన ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన 1200 మందికి పైగా విద్యుత్ ఉద్యోగులకు ఉమ్మడి హైకోర్టులో ఊరట లభించింది. ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.
ఏపీ స్థానికత కలిగిన విద్యుత్ ఉద్యోగులు.. తమ తుది తీర్పు వరకు తెలంగాణకే చెందుతారని హైకోర్టు చెప్పింది. ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 58 శాతం, తెలంగాణ ప్రభుత్వం 42 శాతం చెల్లించాలని ఆదేశించింది. నాలుగు వారాల్లో బకాయి జీతాలన్నీ చెల్లించాలని ఆదేశించింది.
విద్యుత్ ఉద్యోగులను తెలంగాణలోనే కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం, 58:42 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వేతనాలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేయడంతో... ఉద్యోగులకు ఊరట లభించింది.
రామగుండం ఎన్టీపీసీలో నిలిచిన విద్యుదుత్పత్తి
కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీ ఐదో యునిట్లో మంగళవారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. ఐదో యునిట్లోని బాయిలర్ ట్యూబ్ లీకేజీ ఏర్పడటంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఆటంక మేర్పడింది.
లోపాన్ని గుర్తించిన యూనిట్ అధికారులు మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం ఎన్టీపీసీలో 1500 మెగావాట్ల మేరకు మాత్రమే విద్యుత్తు ఉత్పత్తి జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
శంషాబాద్లో కిలో బంగారం స్వాధీనం
మంగళవారం ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన దంపతుల వద్ద కస్టమ్స్ అధికారులు కిలోకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా కనిపించిన దంపతులను కస్టమ్స్ అధికారులు పరిశీలించగా వారి చేతికి 8 బంగారు గాజులు, మరో 3 బంగారు బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం కిలో 76గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.