స్మితా సబర్వాల్ కేసు: ఔట్లుక్ మేగజైన్కు ఊరట
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐఏఎస్ అదికారి స్మితా సబర్వాల్ కార్టూన్ కేసులో ఔట్లుక్ పాత్రికేయులకు గురువారం నాడు ఊరట లభించింది. వచ్చే నెల 9వ తేదీ వరకు కేసుకు సంబంధించి అన్ని చర్యల పైన హైకోర్టు స్టే విధించింది.
ఔట్ లుక్ సిబ్బందిని టెర్రరిస్టుల కంటే హీనంగా విచారించారని ఔట్ లుక్ తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. వాదనల అనంతరం న్యాయస్థానం స్టే విధించింది. తదుపరి విచారణ వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేసింది.
కాగా, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్తో పాటు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన అభ్యంతకర కథనాలు ప్రచురించిన ఔట్లుక్ పత్రిక పైన చర్యలు తీసుకోవాలని పలు కేసులు నమోదయ్యాయి.
ఔట్లుక్ ఎడిషన్లో ప్రచురితమైన డీప్త్రోట్ కాలంలో తెలంగాణ నో బోరింగ్ బాబు అంటూ అనేక అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, జూనియర్ ఐఏఎస్ అధికారిణిని సీఎం కార్యాలయంలో అతి ముఖ్యమైన పదవిలో నియమించడం ఒక మిస్టరీ అని, ఐఏఎస్ అధికారిణి ఇటీవల జీన్స్, టీ షర్టు వేసుకుని ఫ్యాషన్ షోలో క్యాట్వాక్ చేస్తూ అబ్బురపరిచిందని కథనంలో పేర్కొనడం హేయమైన చర్యగా ఖండించారు.
విభజన హామీలు అమలు చేయండి: పొంగులేటి
విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి గురువారం డిమాండ్ చేశారు. తెలంగాణకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదన్నారు. విభజన వల్ల ఖమ్మం జిల్లా నష్టపోయిందన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంటును ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ పైన ప్రధాని మోడీ శీతకన్ను వేశారన్నారు. విపక్షాలతో కలిసి కెసిఆర్ కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.
కెసిఆర్ పాలన ఇలాగే ఉంటే అల్లర్లు: ఏచూరి
కెసిఆర్ పాలన ఇలాగే కొనసాగితే గుజరాత్ రాష్ట్రంలో వలె తెలంగాణలోను అల్లర్లు జరుగుతాయని సిపిఎం నేత సీతారాం ఏచూరీ హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజా సంఘాలతో కలిసి ఐక్యంగా పోటీ చేస్తామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం బిజెపికి ఇష్టం లేదని, అందుకే ఆలస్యం అవుతోందన్నారు.
తాగుబోతుల తెలంగాణ తెస్తారా: టిడిపి
కెసిఆర్ తాగుబోతుల తెలంగాణను తీసుకువస్తారా అని టిడిపి గ్రేటర్ అధ్యక్షులు కృష్ణయాదవ్ ప్రశ్నించారు. రాష్ట్రం కరవు, కాటకాలతో ఉంటే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్నారు.