కరోనా లక్షణాలున్న రిమాండ్ ఖైదీ పరారీ .. టెన్షన్ లో స్థానికులు ..పోలీసుల గాలింపు
తెలంగాణ రాష్ట్రంలో కరోనాకేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎక్కడపడితే అక్కడ కరోనా వ్యాప్తిచెందుతున్న తీరు ఆందోళనకరంగా తయారైంది. తాజాగా వరంగల్ అర్బన్ జిల్లా ఎంజీఎం ఆసుపత్రి నుంచి కరోనా లక్షణాలున్న రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న అతడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు వరంగల్ సెంట్రల్ జైలు అధికారులు. రిమాండ్ ఖైదీగా ఉన్న సదరు వ్యక్తి నుండి టెస్టుల కోసం నమూనాలు సేకరించి, కరోనా లక్షణాలు ఎక్కువగా ఉండటంతో కోవిడ్ వార్డు లో ఉంచారు.
అయితే అతను అక్కడి నుండి తప్పించుకొని పారిపోయాడు. అతనికి ఎస్కార్ట్ గా జైలు సిబ్బంది ఉన్నప్పటికీ అతను తప్పించుకుని పారి పోవడం గమనార్హం. తప్పించుకున్న రిమాండ్ ఖైదీ, కరోనా పాజిటివ్ ఉన్నట్టు భావిస్తున్న వ్యక్తి హన్మకొండ సుబేదారికి చెందిన సయ్యద్ ఖైసర్ గా గుర్తించారు. 14 చోరీలు చేసిన అతను గత నెలలోనే అతను పట్టుబడ్డాడు. ఆయా చోరీల కేసుల్లో ప్రస్తుతం అతడు వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా వున్నాడు.
కరోనా పేషెంట్ అని భావిస్తున్న రిమాండ్ ఖైదీ పారిపోవటంతో మట్టెవాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు జైలు సిబ్బంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. అయితే కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న వ్యక్తి కావడంతో అతని ద్వారా ఇంకా ఎంతమందికి కరోనా వ్యాపిస్తుందో అని ఆందోళన చెందుతున్నారు వరంగల్ వాసులు.