భట్టి వర్సెస్ కేసీఆర్: 'ఉత్తమ్ తండ్రి 15ఏళ్ల క్రితం భూమి విక్రయిస్తే!, కాంగ్రెస్ ఎందుకు ఆపని చేయలేదు
సూర్యాపేట జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి 15ఏళ్ల క్రితం విక్రయించిన భూమికి కూడా ప్రభుత్వం పట్టా ఇవ్వలేకపోయిందని విమర్శించారు.
హైదరాబాద్: భూ రికార్డుల ప్రక్షాళన అంశంపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది. రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలో భూ రికార్డుల ప్రక్షాళన జరుగుతుందన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ తప్పుబట్టారు.
హామి ఇవ్వగలరా?
రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనకు సభలో 10రోజులు కేటాయించారని, ఆ తర్వాతైనా రాష్ట్రంలో ఒక్క పెండింగ్ సమస్య ఉండదని హామి ఇస్తారా? ఇవ్వగలరా? అంటూ భట్టి సీఎంను నిలదీశారు. దీంతో భట్టి వ్యాఖ్యలపై కేసీఆర్ మండిపడ్డారు. హామి ఇస్తానో, ఇవ్వనో అన్న విషయాన్ని కూడా వారే మాట్లాడితే ఎలా? ఇదెక్కడి విధానమంటూ ప్రశ్నించారు.
వాటి జోక్యం ఉండదు: కేసీఆర్
రైతు సమన్వయ సమితుల పని వేరు అని , భూ రికార్డుల ప్రక్షాళన వేరని, ఈ పనిలో సమన్వయ సమితులను జోక్యం చేసుకోవాలని ఎక్కడా చెప్పలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. భట్టి వ్యాఖ్యలు సభను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని.. కాబట్టి ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని అన్నారు.
కాంగ్రెస్ ఆ పని ఎందుకు చేయలేదు
రాష్ట్రాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ భూ రికార్డులను ఎందుకు ప్రక్షాళన చేయలేదో చెప్పాలని ఈ సందర్భంగా కేసీఆర్ డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి 15ఏళ్ల క్రితం విక్రయించిన భూమికి కూడా ప్రభుత్వం పట్టా ఇవ్వలేకపోయిందని విమర్శించారు.
నిర్మాణాత్మక సలహాలు ఇవ్వండి
భూసమగ్ర సర్వేలో భాగంగా ఆ భూమికి ప్రభుత్వం పట్టా ఇచ్చిందని గుర్తుచేశారు. భూ రికార్డుల ప్రక్షాళనపై ప్రతిపక్షాలు అనవసర విమర్శలకు పోవద్దని, విషయమేదైనా నిర్మాణాత్మక సూచనలు చేస్తే బాగుంటుందని కేసీఆర్ అన్నారు.