కారు గుర్తువల్లే ఓడిపోయా, దానిని తొలగించండి: టీఆర్ఎస్కు గద్వాల అభ్యర్థి షాక్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో కారు గుర్తుకు పడాల్సిన ఓట్లు పడ్డాయని, అందుకే తమ పార్టీ 88 సీట్ల వద్ద ఆగిపోయిందని, ట్రక్కు గుర్తు లేకుంటే తమ పార్టీకి వంద సీట్లు వచ్చేవని ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పలుమార్లు చెప్పారు.
కారు గుర్తు వల్లే ట్రక్కు గుర్తుకు ఓట్లు రాలేదు
అయితే, ఇప్పుడు ఇది రివర్స్ అవుతోంది. అసలు కారు గుర్తు వల్లే తమకు రావాల్సిన ఓట్లు రాలేదని, ట్రక్కు గుర్తుకు పడాల్సిన ఓట్లు కారు గుర్తుకు పడ్డాయని, కాబట్టి కారు గుర్తును తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అభ్యర్థి డిమాండ్ చేస్తున్నారు.
ఓటర్లు గందరగోళం
సమాజ్వాదీ ఫార్వార్డ్ బ్లాక్ (ఎస్ఎఫ్బీ) పార్టీ తరఫున గద్వాల నియోజకవర్గం నుంచి అబ్దుల్ మహ్మద్ పోటీ చేసి ఓడిపోయారు. అయితే తనకు పడాల్సిన ఓట్లు కారు గుర్తుకు పడ్డాయని ఆయన చెబుతున్నారు. ఈ కారణంగానే తాను ఓడిపోయానని చెబుతున్నారు. ట్రక్కు, కారు గుర్తుల విషయంలో ఓటర్లు గందరగోళానికి గురయ్యారని చెబుతున్నారు. లోకసభ ఎన్నికల్లో ఇలాంటి గందరగోళంతలెత్తకుండా ఉండేందుకు కారు గుర్తును తొలగించాలని కోరుతూ తెలంగాణ ఈసీ రజత్ కుమార్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు.
ఇప్పటికే కాంగ్రెస్ ఆగ్రహం
ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో వివాదాలు ముగిసిపోలేదు. వీవీప్యాట్ యంత్రాలు లెక్కించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేయడమే కాకుండా హైకోర్టుకు కూడా వెళ్లింది. అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ల దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు నేతలు హైకోర్టు తలుపు తట్టారు. మాజీ మంత్రి డీకే ఆరుణ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువ వచ్చాయని, అలా తేడా రావడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని చెప్పారు.