ట్రైలరే ఇలావుంటే.. సినిమా ఎలాగో?: కెసిఆర్పై రేణుక సెటైర్లు
ఖమ్మం: తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేణుకా చౌదరి మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన సాగుతోందని మండిపడ్డారు. కెసిఆర్ ప్రభుత్వ హయాంలో ముందు ముందు ప్రజలు మరెన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు.
'పెన్షన్లకు డబ్బులుండవు. ఉద్యోగుల వేతనాలకు డబ్బుల్లేవ్. బతుకమ్మకు మాత్రం బడ్జెట్ ఉంటుంది. సీఎం కేసీఆర్.. ఫాం హౌస్లో పడుకుని ఏదేదో మాట్లాడుతుంటారు. ఏవేవో హామీలిస్తుంటారు. వాటిలో ఒక్కటీ అమలు కాదు' అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు.
అంతేగాక, 'ఈ ప్రభుత్వం పనైపోయింది. ట్రైలరే ఇలా ఉంటే.. సినిమా ఇంకెలా ఉంటుందో... అర్థం చేసుకోవచ్చు. 2018లోనే ఎన్నికలు వచ్చే అవకాశముంది' అని రేణుకాచౌదరి వ్యాఖ్యానించారు. ఆమె మంగళవారం సత్తుపల్లిలో డీసీసీ అధికార ప్రతినిధి రామిశెట్టి సుబ్బారావు నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
ప్రధాన పథకాల అమలులో అవినీతి బహిరంగంగానే కనిపిస్తోందని, ఈ ప్రభుత్వ పనితీరు ప్రజలకు అర్థమైందని, ఏం చేయాలో వారే తేల్చుకుంటారని ఆమె అన్నారు. జిల్లాలో ఎక్కడ చూసినా జామాయిల్, సర్వే బాదుల తోటలే కన్పిస్తున్నాయని, ఇవి వేస్తే తర్వాత కాలంలో బంజరు భూములుగా మారిపోతాయన్నారు.
అంతేగాక, భూగర్భ జలాలు అడుగంటుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లను ఈ ప్రభుత్వం ఎన్నటికీ కట్టలేదని ఎద్దేవా చేశారు. ఎంపీ ల్యాడ్స్ నుంచి ఐదులక్షల రూపాయలు మంజూరు చేస్తే.. కేవలం ఒక్క గదికే ప్రతిపాదనలు ఇస్తున్నారని, అదే 5లక్షలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఎలా కడతారో అర్థమవడం లేదని అన్నారు.
ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి జిల్లాలో రూ.30 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు చెప్పారు. సత్తుపల్లిలోని కాకర్లపల్లి చీపురి కుంటను కొందరు ఆక్రమించి పంటలకు నీళ్లు అందకుండా అడ్డుకుంటుంటే అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలు చేయాలనుకుంటే అధికారులు ముందుగా ఉద్యోగాలు మానేయాలని హితవు పలికారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు తాము పోరాటం చేస్తూనే ఉంటామని అన్నారు.