హాఫ్ ఫోటో చూసి అంటారా?: రేణుకా చౌదరి కూతురు కౌంటర్
ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి పైన నెటిజన్ల విమర్శలకు ఆమె కూతురు తేజస్విని ధీటుగా సమాధానం చెప్పారు. తన తల్లి పైన అనవసరంగా నిందలు వేస్తున్నారని తేజస్విని ఆవేదన వ్యక్తం చేశారు.
తన తల్లి పైన సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు సరికాదన్నారు. ఓ రెస్టారెంటుకు వెళ్లిన రేణుక కుటుంబం.. పనమ్మాయిని పక్కనే నిలబెట్టి భోజనం చేస్తున్నట్లు ఓ ఫోటో నెట్లో వైరల్ అయింది. దీనిపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తేజస్విని స్పందించారు.
రేణుకా! ఇది మీకు తగునా?: సామాజిక మాధ్యమాల్లో విమర్శల వర్షం
విషయం తెలుసుకోకుండా, సగం ఫోటో చూసి నిందలు వేయడం సరికాదని తేజస్విని అన్నారు. పనమ్మాయిని తన కోసమే నిమమించారని, ఆమె బాలిక కాదని, 26 ఏళ్ల వయస్సు మహిళ అన్నారు. ఆమెకు 9, 7 ఏళ్ల వయస్సు పిల్లలు ఉన్నారని చెప్పారు. ఆమె కూడా రెస్టారెంటులో తమతో పాటు భోజనం చేసిందన్నారు.
మా అమ్మ అందర్నీ సమానంగా చూస్తుందని, తన చుట్టు ఉన్న వారి అవసరాలను స్వయంగా తెలుసుకొని తీరుస్తుందని చెప్పారు. ధైర్యం, విశ్వాసం, దయాగుణం కలిగిన అమ్మ ఇప్పటికీ ప్రజల కోసం పని చేస్తోందని, అలాంటి తన తల్లిపై నిందలు సరికాదన్నారు.
ఆమె సహాయం పొందిన వారిలో చాలామందికి ట్విట్టర్ ఖాతాలు లేవన్నారు. హాఫ్ ఫోటో చూసి విమర్శలు చేయడం సరికాదన్నారు. అసలు ఏం జరిగిందో తెలియకుండా ఎదుటివారిని బాధపెట్టే వ్యాఖ్యలు చేయవద్దని నెటిజన్లకు హితవు పలికారు.