తెగని పార్లమెంట్ ప్రతిష్టంభన: రాజీనామాకు రేణుకా డిమాండ్, బీజేపీ వ్యూహాం?
హైదరాబాద్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేతలు రాజీనామా చేసే వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనివ్వబోమని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేణుకాచౌదరి స్పష్టం చేశారు. లోక్సభ వాయిదా పడిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గత పది రోజులుగా సభా కార్యక్రమాలు నిలిచిపోతే ఈ రోజు చర్యలు చేపట్టడం అర్ధరహితమని అన్నారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, ఇద్దరు బీజేపీ సీఎంలు రాజీనామా చేయాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. ఇన్నిరోజులు తమ డిమాండ్లను నెరవేర్చకుండా కాలయాపన చేసి ఇప్పుడు చర్చలకు పిలవడాన్ని రేణుకా చౌదరి తప్పుబట్టారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగాలంటే ఆ ముగ్గురు రాజీనామా చేయాల్సిందేనని ఆమె తేల్చి చెప్పారు.
మరోవైపు పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించలేదు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో సోమవారం మధ్యాహ్నాం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో అధికార, విపక్షాల మధ్య సయోధ్య కుదరలేదు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రాజీనామా చేయకపోతే సభను సాగనిచ్చేది లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లిఖార్జున ఖర్గే, గులాంనబీ ఆజాద్ తేల్చిచెప్పారు. మంత్రులు ఎలాంటి తప్పు చేయలేదని, వారు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని బీజేపీ స్పష్టం చేసింది.
మరోవైపు ప్రభుత్వం, కాంగ్రెస్ పట్టింపులకు పోయి పార్లమెంట్ను స్తంభింపచేయడం సరికాదని వాపోతున్నాయి. ఈ వర్షాకాల సమావేశాల్లో కీలక బిల్లులు ఆమోదం పొందాల్సి ఉందని, అందుకు విపక్షాలు సహకరించాలని బీజేపీ కోరింది. అఖిలపక్ష సమావేశం విఫలం కావడంతో బీజేపీ వేరే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.
ఒకవేళ కాంగ్రెస్ దారికి రాకపోతే తమకున్న సంఖ్యాబలంతో లోక్సభలో బిల్లులను ఆమోదింపజేసుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రాజ్యసభలో సంఖ్యాబలం తక్కువగా ఉండటంతో అక్కడ అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి సారించింది.
అఖిలపక్ష సమావేశానికి కేంద్ర ప్రభుత్వం తరపున రాజ్నాథ్సింగ్, వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ నుంచి మల్లిఖార్జున ఖర్గే, గులాంనబీ ఆజాద్తో పాటు శరద్యాదవ్(జేడీయూ), శరద్పవార్(ఎన్సీపీ), మిశ్రా(బీఎస్పీ), రామ్గోపాల్ యాదవ్(ఎస్పీ), తెలుగుదేశం పార్టీ నుంచి తోట నరసింహం, సుజనాచౌదరి తదితరులు హాజరయ్యారు.