కొత్త జిల్లాల వెనుక టీఆర్ఎస్ దుర్బుద్ధి: పార్టీ మార్పుపై రేణుకా స్పందన ఇదీ
హైదరాబాద్: తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై కాంగ్రెస్ నేత రేణుకాచౌదరి స్పందించారు. గురువారం రైతు సమస్యలపై ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తాను కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు రావడం లేదని తనపై దుష్ప్రచారం ఆమె మండిపడ్డారు.
నకిలీ విత్తనాలతో ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లోని రైతులు బాగా నష్టపోయారని పేర్కొన్నారు. నకిలీ విత్తన కంపెనీలపై చర్యలు తీసుకోకుండా వారిని కాపాడటంలో ఆంతర్యమేమిటని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు. ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆమె విమర్శించారు.
కొత్త జిల్లాల వెనుక టీఆర్ఎస్ దుర్బుద్ధి: ఎల్. రమణ
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై తెలంగాణ టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై గురువారం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ పాలన వల్ల తెలంగాణ అభివృద్ధి చెందలేకపోతోందని ఆయన విమర్శించారు. కొత్త జిల్లాల ఏర్పాటు విధానం పట్ల కరీంనగర్ జిల్లా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. జిల్లాల విభజన అంశంలో స్పష్టత లేదని ఆయన అన్నారు. జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా జరుగుతోందని చెప్పారు.
ఒక పద్ధతి, విధానం లేకుండా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళుతోందని ఆరోపించారు. కేసీఆర్ సర్కారు దుర్బుద్ధితో, తదుపరి ఎన్నికల్లో మళ్లీ అధికారం పొందడమే లక్ష్యంగా పనిచేస్తోందని అన్నారు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి నష్టం కలుగుతుందని అన్నారు.