పవన్ కళ్యాణ్! సినిమాలు చేసుకో: చిరంజీవిని లాగి రేణుకా చౌదరి తీవ్రవ్యాఖ్య
ఖమ్మం: తెలంగాణ జిల్లాల్లో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేణుకా చౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సినిమా వాళ్లకు రాజకీయాలు వద్దని చెప్పిన ఆమె చిరంజీవికి, పవన్కు తేడా ఉందని అభిప్రాయపడ్డారు.
కొత్తగూడెంలో జనసేనానికి చేదు: ఓ వైపు సీఐ మరోవైపు ఏసీపీ, పవన్ 20 ని.లు ఏం చెప్పారో
అజ్ఞాత వాసంలో ఉన్న సినిమా స్టార్ పవన్ కళ్యాణ్ జిల్లాలో పర్యటిస్తున్నారని, రాజకీయాలను దుర్వినియోగం చేస్తూ మొసలి కన్నీరు కారిస్తే ప్రజలు అలాంటివారిని నమ్మేస్థితిలో లేరని ఆమె పరోక్షంగా విమర్శించారు.
ఎన్టీఆర్, చిరంజీవిల గురించి
స్వర్గీయ నందమూరి తారక రామారావు ఒక సిద్ధాంతంతో రాజకీయాల్లోకి వచ్చారని రేణుకా చౌదరి అన్నారు. చిరంజీవి లాంటి వారు ఒకస్థాయి కలిగిన వారని చెప్పారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె చిరంజీవి రాజకీయాల్లోకి రావడం వేరు అని అభిప్రాయపడ్డారు. చిరంజీవి స్థాయికి సరిపోరని కూడా అభిప్రాయపడ్డారు.
పవన్ కళ్యాణ్! సినిమాలు చేసుకో
సినిమా స్టార్లు సినిమాలు తీసుకుంటే మంచిదని హితవు రేణుకా చౌదరి.. పవన్కు హితవు పలికారు. పత్రికల్లో ప్రసార మాధ్యమాల్లో ప్రచారం, ఫొటోల కోసం పర్యటనలు చేస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. దేశంలో ఎంజీఆర్, ఎన్టీఆర్ మాత్రమే రాజకీయాల్లో హుందాతనాన్ని నిలుపుకున్నారని చెప్పారు. కేసీఆర్ను ప్రశంసిస్తున్న పవన్కు రాజకీయ అనుభవం లేదన్నారు.
వీహెచ్ అభ్యర్థిత్వంపై పవన్కు రేణుక
పవన్ కళ్యాణ్ పాపం పసివాడు అని కూడా రేణుకా చౌదరి అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత వీహెచ్ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే మద్దతిస్తానని పవన్ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేణుక మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్త సీఎం అభ్యర్థే అన్నారు. తనకు సీఎం కావాలనే ఆశ లేదని ఆమె చెప్పారు.
రేణుకా చౌదరి ఇంకా మాట్లాడుతూ..
ఆమె ఇంకా మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమయ్యాయని, కాంగ్రెస్ జగన్నాథ రథచక్రాలు కదులుతున్నాయని రేణుకా వ్యాఖ్యానించారు. దేశ ప్రధాని మోడీకి ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదన్నారు. ప్రధాని పార్లమెంటు సమావేశాలను వాయిదా వేసుకుని పలుమార్లు గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారన్నారు.
కాంగ్రెస్కు ప్రజల ఆహ్వానం
వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్కు రాష్ట్రంలో ప్రజలు ఆహ్వానం పలుకుతున్నారని రేణుకా చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు మేలు చేయడంలో విఫలమయ్యారన్నారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలను అనేక రకాలుగా నరకం చూస్తున్నారన్నారు. చౌకదుకాణాల్లో వృద్ధుల వేలిముద్రలు సరిగా లేవని రేషన్ నిరాకరిస్తున్నారన్నారు. నిరుద్యోగులను నిలువునా మోసం చేశారని ఆరోపించారు. రెండు పడక గదుల ఇళ్లు నిర్మాణ దశలోనే కూలిపోతున్నాయన్నారు.