పక్కా ప్రణాళికతోనే అమెరికా వెళ్లాలి: విద్యార్థులకు రేణుకా రాజారావు కీలక సూచనలు
హైదరాబాద్: అమెరికాలో చదవాలనుకునే విద్యార్థులు కనీసం ఏడాదిన్నర ముందు నుంచే ప్రణాళికను రూపొందించుకోవాలని అమెరికా(యూఎస్)-ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (యూఎస్ఐఈఎఫ్) భారత సమన్వయకర్త రేణుకా రాజారావు సూచించారు. పూర్తిస్థాయిలో నమ్మకమైన సమాచారం పొందిన తర్వాతే, ఆయా విశ్వవిద్యాలయాలను, కోర్సులను ఎంపిక చేసుకోవాలని ఆమె చెప్పారు.
గురువారం హైదరాబాద్కు వచ్చిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అమెరికా-భారత్ విద్యార్థులకు పరస్పర సహకారం అందించే నిమిత్తం రెండు దేశాల ఒ్పందంలో భాగంగా ఆరు దశాబ్దాల క్రితం ఈ ఫౌండేషన్ ఏర్పాటైందన్నారు. దాదాపు 170 దేశాల్లో 450 కేంద్రాల ద్వారా ఇది సేవలు అందిస్తోందని తెలిపారు.
భారత్లో హైదరాబాద్ సహా దిల్లీ, ముంబయి, కోల్కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్లలో ప్రాంతీయ కేంద్రాలున్నాయనీ, హైదరాబాద్లో అమెరికా కాన్సులేట్లోనే ప్రాంతీయ కేంద్రం ఉందని తెలిపారు. అక్కడ ఫౌండేషన్ ప్రాంతీయ అధికారి ప్రియా బహదూర్ను సంప్రదించి, అమెరికా విద్యకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు. సంస్థ అన్ని విధాలా మార్గదర్శనం చేస్తుందని తెలిపారు.
విద్యార్థులు అమెరికాలో చదువుకొనేందుకు ఐదు దశలను ఎలా పూర్తిచేయాలో www.educationusa .state.gov, www.usief. org.in వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని వివరించారు.
పార్ట్టైమ్ ఉద్యోగం చేసేందుకు అనుమతి అవసరం
తెలుగు విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపుతున్నారనీ, అందుకే పూర్తి సమాచారంతోనే అక్కడికి అడుగుపెట్టాలని ఆమె సూచించారు. విద్యా సంస్థ అనుమతి మేరకు ఆన్ క్యాంపస్లో పార్ట్టైమ్ ఉద్యోగాలు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే కోర్సుకు సంబంధించిన విషయాల్లోనూ పార్ట్టైమ్గా పనిచేయవచ్చని, దానిని కరికులమ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (సీపీటీ)గా పిలుస్తారని తెలిపారు.
చదువు పూర్తయ్యాక ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) పేరిట ఏడాదిపాటు ఉద్యోగం చేసుకోవచ్చని చెప్పారు. ఉద్యోగం ఇచ్చిన సంస్థ ఈ కార్యక్రమంలో మీ పేరును చేర్చితే, ఓపీటీ కింద రెండున్నర సంవత్సరాలు పనిచేయవచ్చని తెలిపారు. హెచ్-1బీకి కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అధికారులు అడిగే ప్రశ్నలకు కచ్చితమైన సమాచారమివ్వాలన్నారు.
తిరిగి వచ్చినవారు మళ్లీ మరో విశ్వవిద్యాలయానికి దరఖాస్తు చేసుకోవచ్చని, వీసా కూడా పొందవచ్చని వివరించారు. మళ్లీ అదే విశ్వవిద్యాలయం అంటే మాత్రం ఏవైనా సమస్యలు ఎదురుకావచ్చని తెలిపారు.
విద్యాసంస్థల గుర్తింపూ కీలకమే
అమెరికాలోని గుర్తింపు ఉన్న విశ్వవిద్యాలయాలు, కళాశాలల జాబితాను విద్యార్థులు తప్పనిసరిగా సరిచూసుకోవాలన్నారు. www.che.org ద్వారా వీటిని తెలుసుకోవచ్చు. ఇంజినీరింగ్, టెక్నాలజీ కోర్సులకు ప్రత్యేకంగా www.abet.org, ఇతర సైన్స్ కోర్సులకు www.aacsb.edu ద్వారా పరిశీలించాలని తెలిపారు.
గుర్తింపులో ముఖ్యంగా రెండు రకాలున్నాయని తెలిపారు. అందులో ఒకటైన రీజినల్ అక్రిడేషన్ గుర్తింపు ఉంటే ఎలాంటి సమస్య ఉండదని చెప్పారు. మరొకటి నేషనల్ ఎక్రిడేషన్ అని.. దీన్ని ఒకేషనల్, ఇతర మతపరమైన విద్యా సంస్థలకు ఇస్తారని తెలిపారు. ఈ రెండింటి మధ్య తేడాను అర్థం చేసుకోవాలని సూచించారు.
‘అమెరికా కార్నర్'లో సందేహాల నివృత్తి
విద్యార్థులు, తల్లిదండ్రులు ఏమైనా సందేహాలుంటే టోల్ ఫ్రీ నెంబరు 1800-103-1231కు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఫోన్ చేసి తెలుసుకోవచ్చని రేణుకా రాజారావు తెలిపారు. హైదరాబాద్లోని సోమాజిగూడలో సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాలలో అమెరికా కాన్సులేట్ ఆధ్వర్యంలో అమెరికా కార్నర్ పేరిట ఓ కార్యాలయం పనిచేస్తోందని చెప్పారు.
ఇక్కడి గ్రంథాలయంలో అమెరికా విద్యకు సంబంధించిన పుస్తకాలున్నాయనీ.. వాటిని చదివి విద్యార్థులు పూర్తి అవగాహన పెంపొందించుకోవచ్చని ఆమె వివరించారు. ఇంటర్నెట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చన్నారు. ప్రతి గురువారం అమెరికా కార్నర్కు యూఎస్ఐఈఎఫ్ ప్రతినిధి వస్తారనీ, ఆ రోజైనా విద్యార్థులు వచ్చి, తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని రేణుకా రాజారావు సూచించారు.