బీజేపి,టీఆఎస్ ల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి.!దుబ్బాక ప్రజలకు పిలుపునిచ్చిన ఉత్తమ్, రేవంత్.!
దుబ్బాక/హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నిక సందర్బంగా రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. సోమవారం సాయంత్రం బీజేపి, టీఆర్ఎస్ ల మద్య యుద్ద వాతావరణం చోటుచేసుకోగా, ఓటమి భయం పట్టుకున్న గులాబీ, బీజేపి పార్టీలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపైన అవాస్తవాలను ప్రచారం చేసి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఘాటుగా విమర్శిస్తోంది. మంగళవారం పోలింగ్ సందర్బంగా తప్పుడు ప్రచారాలతో దుబ్బాక నియోజక వర్గ ప్రజలను ప్రలోభపెట్టేందుకు ఆ రెండు పార్టీలు ప్రణాళిక రచించాయని టీపిసిసి చీఫ్ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
Recommended Video
దుబ్బాకలో తప్పుడు ప్రచారాలు.. బీజేపి, టీఆర్ఎస్ ల పై మండిపడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి..
నేడు మంగళవారం జరుగుతున్న దుబ్బాక ఎన్నికలను ప్రభావితం చేయడానికి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారబోతున్నారని, ఇలాంటి తప్పుడు ప్రచారన్ని టీఆరెస్-బీజేపీ పార్టీలే చేసాయనే సందేహాలు కలుగుతున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని ఆయన పిలునిచ్చారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి బుద్ధి చెప్పాలనన్నారు ఉత్తమ్. టిఆర్ఎస్ ఓడిపోతామనే భయంతోనే ఇలా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు టీపిసిసి చీఫ్ ఉత్తమ్.
సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు.. దుబ్బాక ఓటర్లకు ఉత్తమ్ విజ్ఞప్తి..
అంతే కాకుండా బీజేపీ, టిఆర్ఎస్ కుట్ర పూరితంగా ఈ ప్రచారానికి పాల్పడుతున్నాయని అన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలను ఓటర్లు నమ్మొద్దని, చెరుకు శ్రీనివాస్ రెడ్డి అత్యంత నిజాయితీ పరుడని, నిబద్ధత గల నాయకులని, ఆయన గెలిస్తే దుబ్బాక అభివృద్ధి జరుగుతుందని ఉత్తమ్ తెలిపారు. మంత్రి హరీష్ రావు, బీజేపి అభ్యర్థి రఘునందన్ దగ్గర బంధువులని, వాళ్ళే కావాలని కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
దుష్ర్ఫచారాలపై అప్రమత్తంగా ఉండండి.. దుబ్బాక ప్రజలకు ఎంపీ రేవంత్ రెడ్డి పిలుపు..
దుబ్బాకలో నియోజకవర్గంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీని ప్రత్యక్ష్యంగా ఎదుర్కోలేక వెన్నుపోటు రాజకీయానికి తెర తీసాయని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పై తప్పుడు ప్రచారాలకు తెగబడటమే కాకుండా ప్రజలలో గందరగోళాన్ని సృష్టించే కుట్రకు ఆ రెండు పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయని, ఫేక్ న్యూస్ వ్యాప్తి వెనుక హరీష్, రఘునందన్ ల ప్రమేయం ఉందన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థిపై తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని, ప్రజలు అనవసర గందరగోళాలకు గురి కావద్దని రేవంత్ పిలుపునిచ్చారు. దుష్ర్ఫచారాలపై అప్రమత్తంగా ఉండి, స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని దుబ్బాక ప్రజానీకానికి విజ్ఞప్తి చేసారు రేవంత్ రెడ్డి.
ఓటమి భయంతోనే టిఆర్ఎస్ తప్పుడు ప్రచారం.. ధ్వజమెత్తిన భట్టి విక్రమార్క..
దుబ్బాకలో అధికార టిఆర్ఎస్ పార్టీ ఓటమి భయంతోనే తప్పుడు ప్రచారాన్ని సృష్టించడమే కాకుండా, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఓ ప్రయివేట్ న్యూస్ ఛానల్ లోగోతో టీవీలలో శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతున్నట్టు వస్తున్న ప్రచారాన్ని ఆయన పూర్తిగా ఖండించారు. రాజకీయాలలో టిఆర్ఎస్ నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చిందని, ఓడిపోతామనే భయంతో ఎంతటి నీచనికైనా దిగజారిపోతోందని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు ఇది దుబ్బాక ప్రజలు నమ్మరని కాంగ్రెస్ గెలుపు ను ఎవరు ఆపలేరని సీఎల్పీ నేత భట్టి స్పష్టం చేసారు.