మావోయిస్టు గణపతి లొంగుబాటుకు పోలీసుల సహకారం - కేసీఆర్ దగ్గరి వ్యక్తుల ద్వారా మంతనాలు?
మావోయిస్ట్ అగ్రనేత ముప్పాళ లక్ష్మణ రావు అలియాస్ గణపతి లొంగిపోనున్నట్లు వస్తున్న వార్తలపై తెలంగాణ పోలీసు శాఖ స్పందించినట్లుగా ప్రముఖ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. గణపతి లొంగుబాటుపై తెలుగు సహా జాతీయ మీడియాలో సైతం సోమవారం నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటం తెలిసిందే. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు స్వస్తిపలికి లొంగిపోతామని ఎవరు ముందుకు వచ్చినా, అందుకు శాఖా పరంగా సహకరిస్తామని పోలీసులు చెప్పినట్లు మంగళవారం వార్తలు వచ్చాయి.
మోదీపై దాడికి ఫేస్ బుక్ ఊతం - కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ సంచలనం - జూకర్బర్గ్కు ఘాటు లేఖ
గతంలోనూ సహకరించాం..
బంధువులు, మిత్రుల ద్వారా గణపతి లొంగిపోతాననడం మంచిదేనని, ఎవరి ద్వారా లొంగిపోయినా పూర్తిగా సహకరిస్తామని, గతంలో లొంగిపోయిన జంపన్న, సుధాకర్ లాంటి వారికి ఏ విధంగా సహకరించామో గణపతికి కూడా అలాగే సహకరిస్తామని, లొంగుబాటు ప్రక్రియకు ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంటాయని పోలీసులు వెల్లడించినట్లు తెలుస్తోంది. పునరావాస ప్రక్రియ ద్వారా తెలంగాణలో ఇప్పటి వరకు 1137 మంది నక్సల్స్ లొంగిపోయారని పోలీసులు గుర్తుచేసినట్లు మీడియా సంస్థలు తమ కథనాల్లో పేర్కొన్నాయి.
ఛత్తీస్ గఢ్ లోనూ ఇదే చర్చ..
గణపతితో పాటు మావోయిస్టు పార్టీకి చెందిన వేణుగోపాల్, ఇంకొందరు నాయకులు కూడా పోలీసులకు లొంగిపోనున్నట్లు తెలుగునాట విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఇంకెవరైనా లొంగిపోవడానికి సిద్ధంగా ఉంటే సంప్రదించవచ్చని తెలంగాణ పోలీస్ శాఖ భరోసా ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. కాగా, మావోయిస్టు ప్రభావిత ఛత్తీస్ గఢ్ లోనూ ఇదే అంశంపై చర్చ సాగుతున్నట్లు తెలుస్తోంది. ‘‘కచ్చితంగా లొంగుబాటే అని మాత్రం మాకు తెలీదు. కానీ రెండు రోజులుగా ఇక్కడ గణపతిపై బాగా చర్చ జరుగుతోంది. తెలంగాణలో ఏదో జరుగుతోందని మా వాళ్లు మాట్లాడుకుంటున్నారు''అని ఛత్తీస్ గఢ్ కు చెందిన పోలీస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించినట్లు ‘‘హిందుస్తాన్ టైమ్స్'' పేర్కొంది.
టీఆర్ఎస్ నేతల ద్వారా..
గణపతి లొంగుబాటు అంశంపై ‘‘హిందుస్తాన్ టైమ్స్'' మరో కీలక అంశాన్ని కూడా తన కథనంలో రాసింది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతల ద్వారానే గణపతి లొంగుబాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆ నేతలు.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు చాలా దగ్గరి వ్యక్తులని, ఒకటి రెండు రోజుల్లోనే లొంగుబాటు ప్రక్రియ ఉంటుందని ‘‘హిందుస్తాన్ టైమ్స్'' తెలిపింది. యాదృచ్ఛికంగా, కేసీఆర్, గణపతి ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవారని గుర్తుచేసింది.
గణపతి తలపై రూ.1.5కోట్ల రివార్డు
సారూప్య భావజాలమున్న పార్టీల కలయికగా 2004లో ఏర్పడిన భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు)కు తొలి నుంచీ గణపతే కేంద్ర కార్యదర్శిగా వ్యవహరించారు. 14 ఏళ్ల సుదీర్ఘ బాధ్యతల నుంచి 2018లో తప్పుకోగా, ఆయన స్థానంలో నంబాల కేశవరావు నియమితులయ్యారు. 74 ఏళ్ల గణపతి ప్రస్తుతం ఉబ్బసం, మోకాళ్ల నొప్పులు, మధుమేహంతో తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారని, సరిగా నడవలేని స్థితిలో ఉన్నారని, అందుకే లొంగిపోయి ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాలనుకుంటున్నారని తెలుస్తోంది. మావోయిస్టు నాయకుడైన గణపతి తలపై రూ .1.50 కోట్ల రివార్డు ఉంది.
మహిళ గొంతులో 4 అడుగుల పాము - నోరు తెరిచి నిద్రపోతే అంతే మరి - వైరల్ వీడియో