నయీమ్ కేసులో తొలి ముద్దాయి మాజీ మంత్రి: అరెస్టు అవకాశం?
హైదరాబాద్: గ్యాంగస్టర్ నయీమ్ వ్యవహారంలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నయీం కేసులో తొలి ముద్దాయిగా ఓ మాజీ మంత్రిని చేర్చే అవకాశాలున్నట్లు టీవీ చానెళ్లలో వార్తలు వస్తున్నాయి. ఆ మాజీ మంత్రిని అరెస్టు చేసే అవకాశాలున్నట్లు తెలుగు టీవీ చానెళ్లలో వార్తలు వస్తున్నాయి..
ఆ మాజీ మంత్రి అండదండలతోనే నయీమ్ ఎదిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుర్తించినట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా సిట్ సేకరించిందని అంటున్నారు. నక్సల్స్పై ఉన్న కోపంతో మాజీ మంత్రి నయీమ్ను వాడుకున్నట్లు చెబుతున్నారు.
టీవీ చానెళ్ల కథనం ప్రకారం - నల్లగొండ జిల్లాకు చెందిన ఆ మాజీ మంత్రి వద్ద నయీమ్ ఆశ్రయం పొందినట్లు చెబుతున్నారు. నయీం కేసులో అనుమానితులుగా ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులంతా మాజీ మంత్రి వద్దనే ఆశ్రయం పొందినట్లు చెబుతున్నారు.
నయీమ్ రాజకీయాల్లోకి రావాలని కూడా అనుకున్నట్లు చెబుతున్నారు. నల్లగొండ జిల్లా భువనగిరి ఎమ్మెల్యేలను హత్య చేసి ఆ స్థానంలో మాజీ మంత్రితో పోటీ చేయించాలని అతను అనుకున్నాడని సమాాచారం. ఎమ్మెల్యే హత్యకు రెక్కీ కూడా నిర్వహించాడని అంటున్నారు. ఎమ్మెల్యేలను నయీమ్ బెదిరించాడని కూడా చెబుతున్నారు.
కాగా, నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని నయీమ్ అత్త ఇంట్లో దాదాపు 1400 కోట్ల రూపాయల విలువ చేసే పత్రాలు లభించినట్లు చెబుతున్నారు. అలాగే, నయీమ్ నివాసంలో లభించిన పత్రాల విలువ 630 కోట్లు ఉండవచ్చునని చెబుతున్నారు.