మంథని మధుకర్ది హత్యా? ఆత్మహత్యా: నిగ్గు తేల్చనున్న రీపోస్టుమార్టమ్!
కేవలం సోషల్ మీడియా పిలుపుతో ఐక్యమైన దళిత సంఘాలు మంథనిలో మెరుపు ధర్నా నిర్వహించడంతో.. అటు మీడియాకు, ఇటు అధికార పార్టీకి దీనిపై స్పందించాల్సిన అనివార్యత ఏర్పడింది.
మంథని: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన మంథని మధుకర్ మృతికి సంబంధించి నేడు రీపోస్టుమార్టమ్ జరగనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు మెజిస్ట్రేట్, ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో ఈరోజు మృతదేహానికి మరోసారి పోస్టుమార్టమ్ నిర్వహించనున్నారు.
కేసీఆర్కు మంథని దెబ్బ:మూడెకరాలు పోయి ఆరడగుల జాగనా?, 'మధుకర్' ఘటనపై పెల్లుబికిన ఆగ్రహం
తొలినుంచి ఇది కులం కోణంలో జరిగిన హత్యేనన్న ఆరోపణలు బలంగా ఉండటంతో రీపోస్టుమార్టమ్ లో ఏం నిగ్గు తేలుతుందోనన్నది సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. రీపోస్టుమార్టమ్ నేపథ్యంలో పలువురు దళిత సంఘాల నాయకులు, ప్రజా సంఘాలు మంథనికి చేరుకున్నాయి. 200మంది పోలీసులతో పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది.
మధుకర్ మృతి కేసులో స్థానిక ఎమ్మెల్యే పుట్ట మధు హస్తంపై కూడా ఆరోపణలు ఉండటంతో అటు రాజకీయ పార్టీలు సైతం రీపోస్టుమార్టమ్ రిపోర్టు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఒకవేళ రీపోస్టుమార్టమ్ నివేదిక పారదర్శకంగా లేకపోతే.. మరోసారి దళిత, ప్రజాసంఘాలు ఆందోళన బాట పట్టే అవకాశం ఉంది.
కేవలం సోషల్ మీడియా పిలుపుతో ఐక్యమైన దళిత సంఘాలు మంథనిలో మెరుపు ధర్నా నిర్వహించడంతో.. అటు మీడియాకు, ఇటు అధికార పార్టీకి దీనిపై స్పందించాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యే పుట్ట మధు స్పందిస్తూ తనపై ఆరోపణలు అవాస్తవమని చెప్పిన సంగతి తెలిసిందే. పైగా దీని వెనకాల మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కుట్ర ఉందని కూడా ఆయన ఆరోపించారు.
ఏదేమైనా అత్యంత పాశవికంగా మధుకర్ ను హత్య చేశారన్న ఆరోపణల నేపథ్యంలో రీపోస్టుమార్టమ్ నివేదిక ఏం చెబుతుందోనన్న ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. మరోవైపు మధుకర్ ప్రేమించిన యువతి శిరీషను పోలీసులు విచారిస్తారా?, ఆమె బయటకు వచ్చి నిజా-నిజాల గురించి మాట్లాడుతుందా? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.