'మర్మాంగం కోసిన గాయాలు':రీపోస్టుమార్టం ఏం చెప్తుందో, సర్వత్రా ఉత్కంఠ(ఫోటోలు)
'నా కొడుకును అన్యాయంగా కొట్టి చంపారు. ఇన్ని రోజులు మేం మొత్తుకుంటే ఎవరూ పట్టించుకోలేదు. ఈ రోజు శవాన్ని తీసి చూస్తే కాళ్లు, చేతులు ఇరిగి...పక్క బొక్కలు ముక్కలై.. మర్మాంగంపై కోసిన గాయాలు కన్పించాయి.
మంథని: రాష్ట్రంలో ఏ ఒక్కరి నోట విన్న ఇప్పుడు మంథని మధుకర్ అనుమానస్పద మృతి గురించే చర్చ జరుగుతోంది. సోమవారం నాడు రీపోస్టుమార్టం పూర్తవడంతో.. నివేదికలో ఎలాంటి నిజాలు నిగ్గు తేలుతాయోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
కేసులో న్యాయం జరగకపోతే ఎలాంటి పంథాను అనుసరించాలనే వ్యూహంలో దళిత, ప్రజాస్వామిక సంఘాలు నిమగ్నమయ్యాయి. తొలి నుంచి కేసును పక్కదోవ పట్టించారన్న ఆరోపణలున్న నేపథ్యంలో సీల్డ్ కవర్ నివేదికలో ఏముందన్నది ప్రస్తుతం ప్రతి ఒక్కరిలోను తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
వీడియో చిత్రీకరణ:
సోమవారం నాడు కరీంనగర్ చీఫ్ జ్యుడీషియల్ మెజీస్ట్రేట్ కుషా పర్యవేక్షణలో మధుకర్ తల్లిదండ్రులు లక్ష్మి, ఎల్లయ్య సమక్షంలో కాకతీయ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ నిపుణులు కృపాల్సింగ్, ఉస్మానియా మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ నిపుణులు దేవరాజ్ రీపోస్టుమార్టం నిర్వహించారు. మొత్తం ప్రక్రియనంతా వీడియో రికార్డింగ్ ద్వారా చిత్రీకరించారు.
ల్యాబ్కు అవయవాలు:
మధుకర్ది హత్యా? ఆత్మహత్యా? నిర్ధారించడానికి శరీరంలోని పలు అవయవాలను ఫోరెన్సిక్ నిపుణులు ల్యాబ్ టెస్టులకు పంపించారు. మృతదేహాన్ని ఖననం చేసిన ప్రాంతంలోనే మధుకర్ బాడీకి రీపోస్టుమార్టం నిర్వహించారు. బాడీని పూడ్చిన ప్రాంతంలో.. చుట్టూ సైడ్ వాల్స్ కట్టి ఉదయం 11.30గం. నుంచి సాయంత్రం 4గం. వరకు రీపోస్టుమార్టం నిర్వహించారు.
ఇక్కడ కూడా నిర్లక్ష్యమే:
మధుకర్ను పూడ్చిపెట్టిన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, సిబ్బంది మృతదేహాన్ని వెలికితీసేందుకు ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేసుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తీరా అక్కడికెళ్లాక గానీ ఏర్పాట్లు చేయకపోవడంతో రీపోస్టుమార్టం ఎక్కువ సమయం తీసుకుందని చెబుతున్నారు. ఆఖరికి మృతదేహాన్ని పూడ్చి పెట్టిన బొందను తవ్వినందుకు గాను రూ.500 కూలీలకు ఇవ్వాలంటూ పోలీస్ అధికారులు మధుకర్ తల్లిదండ్రులనే అడగడం గమనార్హం.
స్పృహ కోల్పోయిన తల్లి:
రీపోస్టుమార్టం కోసం మధుకర్ మృతదేహాన్ని వెలికితీస్తున్న క్రమంలో తల్లి లక్ష్మమ్మ తీవ్ర ఆవేదనకు లోనై స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను టెంట్ బయట కుర్చీలో కూర్చోబెట్టారు. రీపోస్టుమార్టం నిర్వహిస్తున్న క్రమంలో మధుకర్ తల్లిదండ్రులను మాత్రమే అనుమతించడంతో చదవుకున్న కుటుంబ సభ్యులు, దళిత సంఘాల పర్యవేక్షణలో బహిరంగ రీపోస్టుమార్టం చేయాలని పలువురు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు కొంతమందిని అనుమతించినట్లు తెలుస్తోంది.
హంతకులను శిక్షించాలన్నడిమాండ్:
రీపోస్టుమార్టం నేపథ్యంలో చాలామంది దళిత, ప్రజాస్వామిక సంఘాల నాయకులు మంథనికి చేరుకున్నారు. ఎండ తీవ్రతను సైతం లెక్క చేయక పోస్టుమార్టమ్ పూర్తయ్యేంతవరకు వారంతా అక్కడే ఉన్నారు. మధుకర్ హంతకులకు శిక్ష పడాల్సిందేనని డిమాండ్ చేశారు. కాకతీయ, ఉస్మానియా, ఇఫ్లూ యూనివర్సిటీలకు చెందిన పలువురు విద్యార్థి నాయకులు సైతం కదిలి వచ్చారు.
వీరితో పాటు ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, అం బేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోగె రాజారాం, దళిత లిబరేషన్ ఫ్రంట్ అధ్యక్షుడు మార్వాడి సుదర్శన్ రీపోస్టుమార్టం పూర్తయ్యేంతవరకు అక్కడే ఉన్నారు. పెద్దపల్లి డీసీపీ విజేయందర్రెడ్డి, గోదావరిఖని ఏసీపీ అపూర్వరావు, కేసు విచారణాధికారి, పెద్దపల్లి ఏసీపీ సింధూశర్మ రీ పోస్టుమార్టం ప్రక్రియ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీఐలు నటేష్, రాములు, వాసుదేవరావు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
తండ్రి ఆవేదన:
'నా కొడుకును అన్యాయంగా కొట్టి చంపారు. ఇన్ని రోజులు మేం మొత్తుకుంటే ఎవరూ పట్టించుకోలేదు. ఈ రోజు శవాన్ని తీసి చూస్తే కాళ్లు, చేతులు ఇరిగి...పక్క బొక్కలు ముక్కలై.. మర్మాంగంపై కోసిన గాయాలు కన్పించాయి. ఇంత దారుణంగా చంపితే మందు తాగి చనిపోయాడని చెప్తున్నారు' అని మృతుడు మధుకర్ తండ్రి మంథని ఎల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
తొలి పోస్టుమార్టంలో శరీరాన్ని మాత్రమే చూపించారని, తల భాగాన్ని వదిలి వేశారని తెలిపారు. రీపోస్టుమార్టంలో తల, కాళ్లు, చేతులు, ఛాతి భాగాలను డాక్టర్లు తమకు చూపించారన్నారు. తలపై బలంగా కొట్టడంతోనే కుడి కన్ను గాయమైనట్లు కనిపిస్తుందన్నారు. రీపోస్టుమార్టంలోనైనా తమకు న్యాయం జరగాలని, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.