మహబూబాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తా: సినీ నటి రేష్మా రాథోడ్
వరంగల్: వచ్చే ఎన్నికల్లో తాను మహబూబాబాద్ పార్లమెంటు స్థానానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ నేత, సినీ నటి రేష్మా రోథాడ్ స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం డోర్నకల్లో పర్యటించారు.
పలువురు బీజేపీ నేతలను కలుసుకుని, స్థానిక విషయాలను అడిగితెలుసుకున్నారు. వారి వినతి మేరకు పట్టణంలోని ప్రధాన వీధిలో రోడ్డు విస్తరణలో భాగంగా గతంలో కూల్చిన దుకాణాలు ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా రేష్మా మాట్లాడుతూ.. ప్రజల సమస్యలతోపాటు స్థానిక అవసరాలేమిటో తెలుసుకునేందుకు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. తన స్వస్థలం ఖమ్మం జిల్లా ఇల్లెందు అని, తన విద్యాభ్యాసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో సాగిందని చెప్పారు.
బయ్యారంలో ఉక్కు కర్మాగారం నెలకొల్పాలనే డిమాండ్తో తాను రాజకీయ రంగ ప్రవేశం చేసినట్లు రేష్మా తెలిపారు. గత అంబేద్కర్ జయతి రోజున తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరినట్లు తెలిపారు. కాగా, రేష్మా రాథోడ్ టాలీవుడ్ తోపాటు తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా నటించారు.