అర్ధరాత్రి కాల్పుల కలకలం: వీడియో వైరల్, మాజీ ఆర్మీ అధికారి అరెస్ట్
పెద్దపల్లి: జిల్లాలోని శాయంపేటలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. అర్ధరాత్రి కాల్పుల శబ్ధం రావడంతో స్థానికులంతా ఆందోళనకు గురయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. తుపాకీతో కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, నిందితుడు ఓ ఆర్మీ మాజీ అధికారి కావడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం శాయంపేటలో అర్ధరాత్రి రిటైర్డ్ ఆర్మీ అధికారి బద్ధం తిరుమల్ రెడ్డి గాల్లోకి కాల్పులు జరిపారు. స్థానికంగా కాల్పులు కలకలం రేపాయి. అయితే, గత కొద్దిరోజుల క్రితం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ వీడియో పోలీసుల వరకు చేరడంతో తిరుమల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పెద్దపల్లి ఏసీపీ కార్యాలయంలో విచారణ జరుపుతున్నారు. కాగా, ఒక పెళ్లి బరాత్లో వివాదం చెలిగిన సందర్భంలో తిరుమల్ రెడ్డి గాల్లోకి కాల్పులు జరిపినట్లుగా సమాచారం. ఈ తతంగాన్ని అక్కడేవున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్డంతో వైరల్గా మారింది.
కాగా, ఆర్మీ అధికారి అయిన తిరుమల్ రెడ్డి ఇటీవలే రిటైర్డ్ అయ్యాడు. తన వద్ద ఉన్నది లైసెన్స్డ్ తుపాకీ అని చెప్పారు. అయితే, చిన్న చిన్న వివాదాలకు కూడా ఆయన తుపాకీ చూపిస్తున్నాడంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. అతడిని కట్టడి చేయాలని పోలీసులను కోరినట్లు తెలిసింది.