నోట్ల రద్దు ఎఫెక్ట్ : కార్డు సర్వీసులు కూడా ఢమాల్..
న్యూఢిల్లీ : నోట్ల రద్దుతో తీవ్ర గందరగోళంలో ఉన్న జనానికి మరో ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే కొత్త నోట్లు దొరక్క.. దొరికిన నోట్లకు చిల్లర లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జనానికి డిబేట్, క్రెడిట్ కార్డుల సర్వీసులు నిలిచిపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేసేలా మారింది.
దేశవ్యాప్తంగా ఉన్న పలు రెస్టారెంట్లు, మాల్స్, మల్టిప్లెక్సుల్లో సోమవారం నుంచి డెబిట్, క్రెడిట్ కార్డుల సర్వీసుల నిలిచిపోయాయి. కౌంటర్ల ముందు డెబిట్, క్రెడిట్ సర్వీసులు నిలిచిపోయాయన్న బోర్డులు దర్శనమిస్తున్నాయి. సాంకేతిక కారణాల వల్లే కార్డు సర్వీసుల నిలిచిపోగా.. మంగళవారం నాటికి కూడా సర్వీసుల పునరుద్దరణ కాకపోవడంతో.. జనానికి మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు.
మునుపెన్నడూ లేని విధంగా ఒక్కసారిగా కార్డు సర్వీసుల వినియోగం పెరిగిపోవడంతో.. సాంకేతిక సమస్యలు తలెత్తినట్టుగా తెలుస్తోంది. కార్డు సర్వీసుల్లో కీలకంగా ఉండే ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్, సంబంధిత బ్యాంకు, పేమెంట్ గేట్ వే సంస్థ సర్వర్ల మధ్య తలెత్తిన సమస్యతో ఈ పరిస్థితి ఉత్పన్నమైందని ఇండియన్ సైబర్ ఆర్మీ వ్యవస్థాపకులు కిస్లే తెలిపారు. ఈ మూడు సర్వీసుల్లో ఏ సర్వర్ డౌన్ అయినా సమస్యలు తలెత్తుతాయని ఆయన పేర్కొన్నారు.
ఇక దీనిపై స్పందించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ జోనల్ హెడ్ కల్పనా గుప్తా.. సమస్యంతా ఆయా సంస్థల సర్వర్ల వద్దనే ఉందన్నారు. చెల్లింపులు జరిపేటప్పుడు ఓ ఆన్ లైన్ రూట్ బిజీగా ఉంటే వెంటనే మరో బ్యాంకు నుంచి చెల్లింపులు జరిగేలా ఉండాలని పేర్కొన్నారు. ఇందుకోసం ఆయా సంస్థలు వివిధ బ్యాంకులతో టైఅప్ అయి ఉండాలని సూచించారు. సర్వర్ల విషయంలో బ్యాంకుల సామర్ధ్యం ఎక్కువగానే ఉందని తెలిపారు.
దక్షిణాసియా డివిజన్ అధ్యక్షుడు పోరుష్ సింగ్ కూడా దీనిపై స్పందించారు. ఎలక్ట్రానిక్స్ పేమెంట్స్ అధికంగా జరుగుతున్నప్పటికీ.. ఇప్పటిదాకా ఎలాంటి సమస్యలు తలెత్తలేదని చెప్పారు. సెకనుకు రూ.4300కోట్ల లావాదేవీలు నిర్వహించే నెట్ వర్క్ మాస్టర్ కార్డుకు ఉందని తెలియజేశారు.