కట్నం కోసం చిత్రహింసలు పెట్టారు! రిటైర్డ్ జడ్జిపై కోడలు ఫిర్యాదు, కేసు నమోదు!
హైదరాబాద్ : రిటైర్డ్ జడ్జి జస్టిస్ నూతి రామ్మోహనరావుపై ఆయన కోడలు వరకట్న వేధింపుల కేసు పెట్టారు. తన భర్త వశిష్ఠతో పాటు అత్త జయలక్ష్మి, మామ జస్టిస్ నూతి రామ్మోహన రావు తనను చిత్రహింసలు పెట్టారని సింధూశర్మ హైదరాబాద్లోని సీసీఎస్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు రిటైర్డ్ జడ్జితో పాటు ఆయన కుటుంబసభ్యులపై కేసు నమోదుచేశారు.
తాగారు, తూళారు, కర్రలతో పరుగెత్తారు : కూకట్ పల్లిలో విద్యార్థుల బీభత్సం, అరెస్ట్
కట్నం కోసం వేధింపులు
జస్టిస్ నూతి రామ్మోహన రావు తన కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్లోని జర్నలిస్టు కాలనీలో నివాసముంటున్నారు. ఆయన కుమారుడు వశిష్ఠకు సింధూశర్మతో ఏడేళ్ల క్రితం పెళ్లైంది. వారికి మూడున్నరేళ్లు, 11నెలల వయసున్న ఇద్దరు పిల్లలున్నారు. అయితే పెళ్లై అత్తారింట్లో అడుగుపెట్టిన నాటి నుంచి భర్త, అత్తమామలు అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తున్నారని సింధూశర్మ ఆరోపిస్తున్నారు. వారు అడిగినట్లు చేయకపోవడంతో తరుచూ కొట్టే వారని చెప్పారు. ఈ నెల 20 దారుణంగా కొట్టి చిత్రహింసలు పెట్టడంతో ఇక భరించలేక తాను పోలీసులను ఆశ్రయించానని అన్నారు.
498ఏ, వరక్నట వేధింపుల కేసు
సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు నూతి రామ్మోహన్రావు కొడుకు వశిష్ఠ, కోడలు సింధులకు మహిళా పోలీస్ స్టేషన్లో రెండుసార్లు కౌన్సిలింగ్ నిర్వహించారు. శనివారం మరోసారి వారిద్దరితో మాట్లాడినప్పటికీ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. ఐపీసీ సెక్షన్ 498ఏ, 406, 323తో పాటు వరకట్న వేధింపుల నిరోధక చట్టం కింద కేసు బుక్ చేశారు.
నా పిల్లల్ని నాకు ఇప్పించండి
ఈ నెల 20న వశిష్ఠ. అతని తల్లిదండ్రులు తీవ్రంగా కొట్టడంతో సింధూశర్మ జూబ్లీహిల్స్ అపోలీ హాస్పిటల్లో చేరినట్లు తెలుస్తోంది. ఆమె భుజం, ఛాతీ, చాతిపై గాయాలైనట్లు అపోలో డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికేట్ను ఆమె పోలీసులకు ఇచ్చారు. ఇదిలా ఉంటే తనను చిత్రహింసలు పెట్టి పిల్లలిద్దరినీ తన నుంచి లాక్కున్నారని, వారిని తిరిగి తనకు అప్పగించాలని సింధు కోరుతున్నారు.