ఫెయిల్ అయిన మూడు లక్షల మంది జవాబుపత్రాలు తిరిగి మూల్యాంకనం చెయ్యాల్సిందే .. హైకోర్టు ఆదేశం
ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై బాలల హక్కుల కమీషన్ వేసిన పిటీషన్ ను విచారించిన హైకోర్టు ఇంటర్ మూల్యంకనం విషయంలో ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జవాబుపత్రాల మూల్యాంకనంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించిన హైకోర్టు ఫెయిలైన విద్యార్థుల పేపర్లను మళ్లీ కరెక్షన్ చేయాలని అభిప్రాయపడింది.
3లక్షల మంది ఫెయిల్ అయినవారి పేపర్లు మూల్యాంకనం చెయ్యాల్సిందేనని హైకోర్టు ఆదేశం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన మూడు లక్షల మంది పేపర్లను పునః మూల్యాంకనం చెయ్యాలని హైకోర్టు ఆదేశించింది . అందుకు ఎంత సమయం పడుతుంది అనే విషయమై అడ్వకేట్ జనరల్ను హైకోర్టు ప్రశ్నించింది. సుమారు 2నెలలు పడుతుంది అని చెప్పడంతో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫెయిల్ అయిన 3లక్షల మంది విద్యార్ధుల పేపర్లు దిద్దటానికి అంత సమయం ఎందుకు అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రశ్నించింది.
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కోర్టుకు విన్నవించిన అదనపు అడ్వకేట్ జనరల్
ఫలితాల్లో గందరగోళంపై విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని జీవోను హైకోర్టుకు సమర్పించారు ప్రభుత్వం తరపు న్యాయవాది . ఫలితాల్లో గందరగోళంపై విచారణకు ప్రభుత్వం త్రిసభ్య కమిటీ వేసిందని చెప్పిన అదనపు అడ్వకేట్ జనరల్ , ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను అధికారులతో చర్చించి చెబుతామని అదనపు అడ్వకేట్ జనరల్ ఉన్నత న్యాయస్థానానికి వెల్లడించారు.
సోమవారం సమగ్ర పరిష్కార మార్గాలతో రావాలని హైకోర్టు ఆదేశం
అయితే ప్రభుత్వం వేసిన కమిటీ తాలూకు జీవో ను పరిశీలించిన హైకోర్టు ఏజెన్సీ పనితీరుపై మాత్రమే విచారణకు ఆదేశించారని అభిప్రాయపడింది. మొత్తం వ్యవహారాన్ని పరిశీలించాలని అభిప్రాయపడింది. దీనిపై న్యాయవిచారణకు ఆదేశించాలంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించగా.. న్యాయవిచారణతో విద్యార్థులకు ప్రయోజనం ఉండదని చెబుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సోమవారంలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. సమస్యను ఎలా పరిష్కరిస్తారో వచ్చే సోమవారం నాటికి స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పరిష్కార మార్గాలతో తమ ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.