బాబుకు షాక్: 40 సీట్లకు పట్టు, 25 సీట్లకు ఓకే: రేవంత్ వ్యూహమిదే!
తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. తన రాజకీయ భవిష్యత్ కోసం రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎంచుకొన్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
హైదరాబాద్: తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. తన రాజకీయ భవిష్యత్ కోసం రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎంచుకొన్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలోరేవంత్రెడ్డి టిడిపిలోనే కొనసాగుతానని ప్రకటించడం కూడ వ్యూహంలో భాగమేననే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.అదే సమయంలో తాను పార్టీలోనే కొనసాగుతానని రేవంత్రెడ్డి చేసిన ప్రకటనలో స్పష్టత లేదని తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ చేసిన ప్రకటన రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.
Recommended Video
తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ టిడిపి నాయకులు అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్పార్టీలో రేవంత్రెడ్డితో పాటు చేరేందుకు సన్నాహలు చేసుకొంటున్న నేతల పేర్లను కూడ టిడిపి నాయకత్వం జాబితా తయారు చేసింది.
అంతేకాదు ఇతర పార్టీలకు చెందిన నేతలను కలిసినట్టుగా ప్రచారమైన టిడిపి నేతల జాబితాను కూడ టిడిపి తెలంగాణ నాయకత్వం తయారు చేసింది. విదేశీ పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కలిసి ఈ జాబితాను అందించనున్నట్టు టిడిపి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ ప్రకటించారు.
రేవంత్ వ్యూహమిదే
తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు.2019 ఎన్నికల్లో తెలంగాణలో టిఆర్ఎస్ను ఢీకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని రేవంత్ భావించారు. అయితే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని కొందరు పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. అయితే అదే సమయంలో టిఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలనే యోచనలో ఉన్నారు. అయితే టిఆర్ఎస్తో పొత్తు ప్రతిపాదనను రేవంత్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంతకాలంపాటు టిఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాటం చేసి... అదే పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని రేవంత్ వ్యతిరేకిస్తున్నారు. మరికొందరు నేతలు కూడ రేవంత్ అభిప్రాయంతో ఏకీభవించారని సమాచారం. ఇదే సమయంలో టిఆర్ఎస్తో టిడిపి పొత్తు ప్రతిపాదన నేపథ్యంలో రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. అయితే ఈ విషయమై రేవంత్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అదే సమయంలో తాను టిడిపిలోనే కొనసాగుతానని కొడంగల్లో రేవంత్ చేసిన ప్రకటన వ్యూహత్మకమేననే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
కాంగ్రెస్ను 40 సీట్లు అడిగిన రేవంత్
టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారనే ప్రచారం సాగుతోంది.ఈ మేరకు రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్గాంధీతో కూడ సమావేశమయ్యారని ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడ రేవంత్రెడ్డి కాంగ్రెస్లోకి వస్తారని చెబుతున్నారు. రేవంత్రెడ్డి కొందరు కాంగ్రెస్ పార్టీ సీనియర్లను కలవడం వెనుక రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది. తాను కాంగ్రెస్ పార్టీలోకి వస్తే సుమారు 40 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందు ప్రతిపాదన పెట్టారని ప్రచారం సాగుతోంది. అయితే రేవంత్కు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం 25 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు సానుకూలంగా ఉందంటున్నారు. అయితే తొలుత 18 అసెంబ్లీ సీట్లు మాత్రం రేవంత్ సూచించిన అసెంబ్లీ సెగ్మెంట్లను కేటాయించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సానుకూలంగా ఉందనే ప్రచారం సాగుతోంది.ఎన్నికల సమయంలో తాను సూచించిన వారికి మిగిలిన టిక్కెట్టు ఇవ్వాలని రేవంత్ కోరినట్టు ప్రచారంలో ఉంది.
అక్టోబర్ 26 తర్వాతే రేవంత్ నిర్ణయం
అక్టోబర్ 26వ, తేది తర్వాతే రేవంత్రెడ్డి తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. విదేశీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అక్టోబర్ 26వ, తేదిన స్వదేశానికి తిరిగి రానున్నారు. చంద్రబాబునాయడు విదేశీ పర్యటన నుండి వచ్చిన తర్వాత చంద్రబాబుతో తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి సమావేశం కానున్నారు. అయితే ఈ సమావేశం తర్వాత రేవంత్రెడ్డి తన వ్యూహన్ని మీడియాకు ప్రకటించే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు అంటున్నారు. టిఆర్ఎస్తో పొత్తు ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో చంద్రబాబుతో రేవంత్ సమావేశం కావాలనే నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకొంది.
బాబు వైఖరేమిటీ?
తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారనే వార్తలపై చంద్రబాబునాయుడు విదేశాల నుండి ఆరా తీశారు. ఈ విషయమై టిడిపి తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణతో చంద్రబాబునాయుడు ఫోన్లో విదేశాల నుండి మాట్లాడారు. రేవంత్ విషయమై ఆరాతీశారు. అయితే బాబు విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో తెలంగాణ పార్టీలో చోటుచేసుకొన్న పరిణామాలపై ఎల్. రమణ చంద్రబాబుకు వివరాలు అందించారు. అయితే విదేశీ పర్యటన తర్వాత చంద్రబాబునాయుడుతో రేవంత్ కలిసేందుకు ప్రయత్నిస్తే బాబు ఏ రకంగా స్పందిస్తారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.
రేవంత్ వ్యతిరేకులకు అందివచ్చిన అవకాశం
తెలుగుదేశం పార్టీలో రేవంత్రెడ్డి అనతికాలంలోనే వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను చేపట్టారు. అతి తక్కువ కాలంలోనే పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించడం కొందరు సీనియర్లకు మింగుడుపడలేదు. అయితే పొత్తుల అంశం తెరమీదికి రావడంతో కొందరు సీనియర్లు రేవంత్ను పరోక్షంగా లక్ష్యంగా చేసుకొనేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకొన్నారనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్గాంధీని రేవంత్రెడ్డి కలిశారనే ప్రచారం బయటకు పొక్కడంతో టిడిపి సీనియర్లు రేవంత్పై ముప్పేట దాడికి సిద్దమయ్యారు.
రేవంత్ లేకుండానే పొలిట్బ్యూరో సమావేశం
కొడంగల్ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి ఆదివారం నాడు వెళ్ళారు. అయితే ఈ సమయంలోనే టిడిపి పొలిట్బ్యూరో సమావేశం ఏర్పాటు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. ఈ సమావేశానికి ముందుగా నిర్వహించిన పొలిట్బ్యూరో సమావేశానికి రేవంత్రెడ్డి అనుహ్యంగా హజరుకావడం కలకలం రేపింది. ఈ సమావేశంలోనే మోత్కుపల్లి నర్సింహ్ములు, అరవింద్కుమార్గౌడ్లు రేవంత్పై విరుచుకుపడ్డారు.రాహూల్ను కలిశారా లేదా అనే విషయమై రేవంత్ మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అంతేకాదు మీడియాలో వచ్చిన వార్తలపై తాను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని రేవంత్ చెప్పారంటున్నారు. చంద్రబాబుకే తాను వివరణ ఇస్తానని రేవంత్ చెప్పారు. అయితే ఈ సమావేశం అర్ధాంతరంగా ముగించారు. మరోవైపు కొడంగల్లో కార్యకర్తల సమావేశంలో ఆదివారం నాడు రేవంత్రెడ్డి పాల్గొన్న రోజునే టిడిపి పొలిట్బ్యూరో సమావేశం ఏర్పాటుచేశారు. రేవంత్ వ్యహరంపై చర్చించారు. షోకాజ్ నోటీసు ఇవ్వాలని మోత్కుపల్లి నర్సింహ్ములు డిమాండ్ చేశారు.