కేసీఆర్, హరీశ్ తలో మాట.. కమిషన్ల కక్కుర్తి, ఇంకెంత కాలం పబ్బం! : రేవంత్
హైదరాబాద్ : ప్రాజెక్టుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తప్పుబడుతూ.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. ప్రాజెక్టులకు సంబంధించి.. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ తలో రకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులన్నింటిని తక్షణం పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రేవంత్.
ప్రాజెక్టులకు పక్క రాష్ట్ర సీఎం చంద్రబాబు అడ్డుపడుతున్నారన్న వాదనను ఖండిస్తూ..చంద్రబాబు పేరు చెప్పి ఇంకెంత కాలం పబ్బం గడుపుకుంటారని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రేవంత్. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు కేటాయించిననిధులు దారిమళ్లిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులకు మహారాష్ట్రతో చేసుకుంటున్న ఒప్పందాలన్నింటిని పునఃసమీక్షించుకునేలా గవర్నర్ చర్యలు తీసుకోవాలని విజ్నప్తి చేశారు.
ప్రాజెక్టుల్లో కమిషన్ల కక్కుర్తికి పాల్పడుతూ తెలంగాణ హక్కులను హరించివేస్తున్నారంటూ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు రేవంత్. ప్రజలు, రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయడానికి టీడీపీ ఉందన్న రేవంత్.. రైతుల హక్కులు కాపాడి తీరుతామని హామి ఇచ్చారు. ఇదే క్రమంలో సెప్టెంబర్ 19,20 తేదీల్లో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద టీడీపీ చేపట్టబోయే రైతు దీక్షను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.