టి తాకట్టు: రేవంత్ భగ్గు, సాయుధ పోరాటంపై లెఫ్ట్Xబీజేపీ, తడబడ్డ నారాయణ
హైదరాబాద్: గోదావరి జలాల పైన మహారాష్ట్రతో కేసీఆర్ ప్రభుత్వం ఒప్పందం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టమని తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి బుధవారం నాడు అన్నారు. అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో ఒప్పందాన్ని సవరించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ టిడిపి నేతలు రేవంత్ రెడ్డి, ఎల్ రమణ తదితరులు గవర్నర్ నరసింహన్ను కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు పైన మాట్లాడుతూ.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమిని సేకరించాలన్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2,700 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం అందలేదన్నారు. ఈ నెల 19, 20వ తేదీన ఇందిరా పార్క్ వద్ద రైతు దీక్ష చేస్తామన్నారు.
గ్రామంలో 144వ సెక్షన్ ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాల పైన గవర్నర్కు ఫిర్యాదు చేశామన్నారు. ఒప్పందంతో తెలంగాణ ఆస్తులను మహారాష్ట్రకు తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. త్వరలో ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారని, ఈ సమయంలో మహా ఒప్పందాన్ని సమీక్షించాలన్నారు.
సాయుధ పోరాటంపై బీజేపీ వర్సెస్ లెఫ్ట్
తెలంగాణ సాయుధ పోరాటం పైన బీజేపీ, లెఫ్ట్ పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. సెప్టెంబర్ 17వ తేదీన విమోచన దినంగా నిర్వహించాలని బీజేపీ కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. తాజాగా, బుధవారం కమ్యూనిస్టుల పైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ మండిపడ్డారు.
తెలంగాణ సాయుధ పోరాటం పైన కమ్యూనిస్టులు అసత్య ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. సైఫుల్లా ఖాన్ లాంటి జర్నలిస్టు కూడా ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. విలీనానికి కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను ప్రజలకు వివరిస్తామని, విమోచన దినాన్ని అధికారికంగా జరిపే వరకు పోరుడుతామన్నారు.
సిపిఐ నేత నారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటానికి బీజేపీ వక్ర భాష్యం చెబుతోందన్నారు. హిందువుల గెలుపుగా చిత్రీకరిస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణ సాయుధ పోరాటం చేసింది కమ్యూనిస్టులేనని తేల్చి చెప్పారు. విలీనం తర్వాత కూడా భూస్వాముకు వ్యతిరేకంగా పోరాడామని, ప్రభుత్వం అధికారికంగా విలీన దినోత్సవాన్ని జరపాలన్నారు.
ఇదిలా ఉండగా, ప్రత్యర్థి పార్టీల పైన విరుచుకుపడే నారాయణ తడబడ్డారు. బీజేపీని విమర్శించబోయి కాస్త తడబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన మీడియాకు విడుదల చేయడం గమనార్హం. పేరు ప్రఖ్యాతలు గాంచిన సాయుధ పోరాటాన్ని బీజేపీ నాయకులు వక్రమార్గంలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఓ వైపున పదివేల.. సారీ అంటూ అర్ధాంతరంగ ముగించారు.