క్షమించండి, చింతిస్తున్నా: శశిథరూర్పై వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి, అసలేం జరిగిందంటే.?
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్పై చేసిన వ్యాఖ్యలను తాను ఉపసంహరించుకుంటున్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. సీనియర్ నేతతో వివాదానికి తెరదించే ప్రయత్నించారు. కాగా, గురువారం కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్య ట్విట్టర్ వార్ నడిచింది. ఐటీ రంగంలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని ప్రశంసిస్తూ శశిథరూర్ ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
శశిథరూర్కు రేవంత్ రెడ్డి క్షమాపణలు..
ఈ క్రమంలో శశిథరూర్పై రేవంత్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే, అది తప్పుడు ప్రచారమని రేవంత్ రెడ్డి ఎదురుదాడి చేయడంతో.. మంత్రి కేటీఆర్.. ఆ ఆడియో క్లిప్ను విడుదల చేశారు. ఇందులో శశిథరూర్ను రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నట్లుగా ఉంది. ఆ ఆడియో క్లిప్ బయటకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి.. ఎంపీ శశిథరూర్కు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. శశిథరూర్పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని, ఆయనపై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్లు ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి. శశిథరూర్ క్షమాపణలు కూడా చెప్పారు.
రేవంత్ క్షమాపణలను అంగీకరించిన శశిథరూర్
శశిథరూర్ను తాను అత్యంత గౌరవించే వ్యక్తినని, తన వ్యాఖ్యలపై శశిథరూర్కు వివరణ ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. కాగ్రెస్లో విధానాలు, విలువలతో పనిచేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి అందరం కృషి చేస్తామన్నారు. తనపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో శశిథరూర్ స్పందించారు. రేవంత్ రెడ్డి చింతిస్తున్నట్లు తెలిపారని, తాను అంగీకరించినట్లు శశిథరూర్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు ఈ సంఘటన జరిగిందన్నారు. తెలంగాణతోపాటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ బలోపేతం కావడానికి తామందరం ఒక్కటిగా కలిసిపనిచేస్తామన్నారు.
శశిథరూర్పై అనుచిత వ్యాఖ్యలు.. క్రిమినలంటూ కేటీఆర్ ఫైర్
అంతకుముందు జరిగిన పరిణామాలను గమనించినట్లయితే.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు . రేవంత్ రెడ్డి ఓ థర్డ్ రేట్ క్రిమినల్ అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంతేకాదు దొంగ ఒక పార్టీని లీడ్ చేస్తున్నారని, టీపీసీసీ 'చీప్ ' రేవంత్ అని ఎద్దేవా చేశారు. ఐటీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ గా ఉన్న కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ ను రేవంత్ రెడ్డి గాడిదతో పోల్చిన ఓ న్యూస్ క్లిప్ ను కేటీఆర్ ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. థర్డ్ రేట్ క్రిమినల్ కు పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగిస్తే ఇలాగే ఉంటుంది అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇటీవల ఐటి స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశిథరూర్ హైదరాబాదులో తన బృందంతో పర్యటించారని, ఐటి అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారని పేర్కొన్నారు. తనకు చెప్పకుండా వచ్చారని శశిధరూర్ ను గాడిద అంటూ వ్యాఖ్యలు చేశారంటూ రేవంత్ రెడ్డి తీరు పై నిప్పులు చెరిగారు.
Recommended Video
రేవంత్ ఎదురుదాడి.. ఆడియో క్లిప్తో కొట్టిన కేటీఆర్..
కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ పర్యటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సమాచారం లేదని, ఇక ఈ ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి ముందు ప్రస్తావించినప్పుడు ఆయన శశిధరూర్ పై మండి పడ్డాడు అని, గాడిద అంటూ సంబోధించారని ఓ పత్రిక వార్త ప్రచురించింది. త్వరలోనే పార్టీ ఆయనను బహిష్కరిస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నట్లుగా ఆ వార్తా పత్రిక కథనాన్ని ప్రచురించింది. అంతేకాదు శశిధరూర్, కేటీఆర్ ఇద్దరూ ఒకే తరహా మనుషులు అని రేవంత్ రెడ్డి అన్నారని, ఇంగ్లీష్ లో ప్రావీణ్యం ఉన్నంత మాత్రాన మేధావులం అని భావించాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్లుగా పత్రిక ప్రచురించింది. ఇక దీనిపై తీవ్రస్థాయిలో మండిపడిన కేటీఆర్.. రేవంత్ రెడ్డి థర్డ్ రేట్ క్రిమినల్ అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. అయితే, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ కేటీఆర్పై మండిపడ్డారు రేవంత్ రెడ్డి. దీనికి స్పందించని కేటీఆర్.. తనకు ఓ రిపోర్టర్ పంపించారంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన ఆడియో క్లిప్ ను ట్విట్టర్లో పోస్టు చేశారు. దీనిపై రాహుల్ గాంధీ ఏమైనా స్పందిస్తారా? అంటూ ప్రశ్నించారు. అంతేగాక, ఈ ఆడియోను ఫోరెన్సిక్ పరీక్షకు పంపితే ఈ ఓటుకునోటు నిందితుడి బండారం బట్టబయలవుతుందంటూ కేటీఆర్.. రేవంత్ రెడ్డికి చురకలంటించారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి.. శశిథరూర్కు క్షమాపణలు చెప్పి తన తప్పును సరిదిద్దుకున్నారు.