కెసిఆర్కు వ్యతిరేకంగా కోదండ అడుగు.. అందుకేనని రేవంత్ రెడ్డి ప్రశంస!
వరంగల్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మంగళవారం దుమ్మెత్తి పోశారు. తెలంగాణ ఉద్యమాన్ని ఏకతాటి పైకి తీసుకొచ్చి ముందుకు నడిపించిన కోదండరాంను టిఆర్ఎస్ నాయకులు, ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదన్నారు.
మంగళవారం హన్మకొండలోని బిజెపి ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. రైతు ఆత్మహత్యలపై కోదండరాం క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. దీంతోనే ఆయన కోర్టును ఆశ్రయించారన్నారు.
కెసిఆర్కు సీఎం పదవిలో ఉండే నైతిక అర్హత లేదన్నారు. రైతు ఆత్మహత్యలను నివారించలేకపోయారన్నారు. అన్ని వర్గాల ప్రజలను కెసిఆర్ మోసం చేశారన్నారు. ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ఉద్యమ సమయంలో ద్రోహం చేసిన వారికి పదవులు ఇచ్చారని మండిపడ్డారు.
కెసిఆర్ తెలంగాణను మృత్యు తెలంగాణగా మార్చారని ధ్వజమెత్తారు. కెసిఆర్ వైఫల్యం వల్ల తెలంగాణలో 1800 మంది రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం పోరాడిన శృతి, విద్యాసాగర రెడ్డిలని కిరాతకంగా హింసించి చంపారన్నారు. పత్తికి మద్దతు ధర కల్పించమని కోరిన కొమురయ్యని జైలుకు పంపించారన్నారు.
కెసిఆర్ను గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కించాలి: చాడ
అబద్దాలు చెప్పడంలో సిఎం కెసిఆర్ ఘనుడని, ఈ విషయంలో ఆయనను గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి మంగళవారం జనగామలో విమర్శించారు.
సంక్షేమ పథకాలను అమలు చేయకుండా మాటమాటలతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని కెసిఆర్ అహంభావం తగ్గాలంటే వరంగల్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని ఓడించాలన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్ధానాలు 99 శాతం అమలు కాలేదన్నారు. వంద శాతం చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.