టీఆర్ఎస్ పోతేనే: రేవంత్ రెడ్డి, కడియం-రాజయ్య ఆలింగనం, వారి తోపులాట
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ యువ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన సోమవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన రైతులకు సూచన కూడా చేశారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన రైతులు పోరాటం చేయాలని, అప్పుడు టిఆర్ఎస్ పార్టీ రాజకీయంగా సమాధి అవుతుందని చెప్పారు. అప్పుడే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని రేవంత్ అభిప్రాయపడ్డారు.
తెలంగాణ దివాలా: ఎల్ రమణ
కెసిఆర్ అసమర్థ పాలనతో తెలంగాణ రాష్ట్రం దివాళా రాష్ట్రంగా మారిందని తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ ఆరోపించారు. ఆయన కరీంనగర్ జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 1700మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎవరూ పరామర్శించిన పాపాన పోలేదన్నారు.
కెసిఆర్ అవినీతికి సహకరించిన సాహ్నాని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారని ఆరోపించారు. మిషన్ కాకతీయ కమీషన్ కాకతీయగా మారిందన్నారు. కెసిఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే బీడీ కట్టల పైన పుర్రె గుర్తు వచ్చిందన్నారు. సిగరేట్ కంపెనీలతో కెసిఆర్ కుమ్మక్కు కావడమే పుర్రె గుర్తుకు కారణమన్నారు. ప్రభుత్వం అలసత్వంతో ఎస్సారెస్సీ ఎండిపోయిందన్నారు. అవినీతిలో దేశంలో టిఆర్ఎస్ సర్కార్ తొలిస్థానంలో ఉందన్నారు.
కడియం, రాజయ్య ఆలింగనం, ఇరువర్గాల తోపులాట
టిఆర్ఎస్కు ఓరుగల్లు ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ సందర్భంగా పార్టీలో ఆసక్తికర పరిణామాలు ఇటీవల చోటు చేసుకున్నాయి. మొన్నటి వరకు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య స్టేషన్ ఘనపూర్లో తలపడ్డారు. ఒకరిపై మరొకరు విజయం సాధించారు.
ఆ తర్వాత మొదట రాజయ్య, ఆ తర్వాత కడియం కారు ఎక్కారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్యను పదవి నుంచి తొలగించిన సీఎం కేసీఆర్... ఆ పదవిలో కడియంను నియమించారు. దీంతో అప్పటిదాకా వారి మధ్య ఉన్న విభేదాలకు మరింత ఆజ్యం పోసినట్లైంది.
అయితే, ఆసక్తికర పరిణామాలు జరిగాయి. ఈ మొన్న హైదరాబాదులో పసునూరి దయాకర్కు పార్టీ బీ ఫారం అందించే సందర్భంగా కేసీఆర్ సమక్షంలో ఇరువురు నేతలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అయితే వారి అనుచరులు మాత్రం అంతకు ఒకరోజు ముందు వారి సమక్షంలోనే వరంగల్లో పరస్పరం తోసుకున్నారు.