కేసీఆర్లాగే, మోడీ ఎంత దిగజారారో చెప్పేందుకు ఇది చాలు: రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్య
హైదరాబాద్: గుజరాత్లో బీజేపీ గెలుపుపై తెలంగాణ కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మంగళవారం నిప్పులు చెరిగారు. పాకిస్తాన్తో కలిసి తన హత్యకు కుట్ర పన్నారనే అబద్దపు ప్రచారంతో ప్రధాని మోడీ లబ్ధి పొందారని ఆయన ఆరోపించారు.
నరేంద్ర మోడీ సొంత నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోయిందన్నారు. కులం, మతం, అబద్దాల ప్రాతిపదికనే మోడీ, బీజేపీ గెలిచారన్నారు. మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలను కులానికి ఆపాదించారని విమర్శించారు. గుజరాత్లో అభివృద్ధి నినాదమే వినిపించలేదని, నైతికంగా బీజేపీ పతనమయిందన్నారు.
సొంతూరులో నరేంద్ర మోడీ గెలిచినట్లా, ఓడినట్లా?
ఇంత దిగజారుడు ప్రధానిని చూడలేదు
ఇంత దిగజారుడు ప్రధానిని తాను చూడలేదని రేవంత్ రెడ్డి అన్నారు. జనసంఘ్ నుంచి బీజేపీ పుట్టుకు వచ్చిందన్నారు. ఆ సమయంలో వాజపేయి, అద్వానీలు ఉన్నారన్నారు. వాజపేయి ఆరోగ్యం బాగా లేదు. కానీ అద్వానీ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదని చెప్పారు.
వాజపేయి అలా చేయలేదు
గుజరాత్లో గెలుపు కోసం ప్రధాని దారుణంగా వ్యవహరించారని రేవంత్ మండిపడ్డారు. బీజేపీ పతనం ప్రారంభమైందన్నారు. వాజపేయీ హయాంలో ఒక్క ఎంపీని కొనుగోలు చేసి ఉంటే ఎన్డీయే ప్రభుత్వం నిలబడి ఉండేదని, కానీ ఆయన అలా చేయలేదన్నారు.
రాక్షస క్రీడ ఆడారు
ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాలు మాత్రం ఎంతకైనా దిగజారుతున్నారని రేవంత్ మండిపడ్డారు. కేసీఆర్ మాదిరి మోడీ-షాలు కూడా గుజరాత్లో రాక్షస క్రీడ ఆడారని విమర్శించారు. మోడీ సొంతూరులో ఓ చోట బీజేపీ, మరోచో కాంగ్రెస్ గెలిచిందని, ఇప్పుడు ఆయన గెలిచినట్లా ఓడినట్లా అన్నారు.
ఈ ఉదాహరణ చాలు
రాహుల్ గాంధీని ఓడించడానికి 182 మంది బీజేపీ నేతలు కష్టపడ్డారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మోడీని హత్య చేసేందుకు పాకిస్తాన్ సుఫారీ తీసుకుంటే ఆ దేశంపై యుద్ధం ప్రకటించాలన్నారు. గుజరాత్ విజయంపై అద్వానీ ఇప్పటి వరకు అభినందించలేదన్నారు. మోడీ దిగజారిపోయారని చెప్పడానికి ఈ ఉదాహరణ చాలని చెప్పారు.