అబద్దాలు ఇవిగో, రాజీనామా చేయండి: కేసీఆర్కు రేవంత్ రెడ్డి ఝలక్
గవర్నర్ ప్రసంగంలో అబద్దాలు ఉన్నాయని, అతిశయోక్తులు నిరూపిస్తే అయిదు నిమిషాల్లో తన పదవికి రాజనామా చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీనిపై టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ధీటుగా సమాధానం ఇచ్చారు.
హైదరాబాద్: గవర్నర్ ప్రసంగంలో అబద్దాలు ఉన్నాయని, అతిశయోక్తులు నిరూపిస్తే అయిదు నిమిషాల్లో తన పదవికి రాజనామా చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీనిపై టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ధీటుగా సమాధానం ఇచ్చారు.
రేవంత్ రెడ్డికి ఝలక్: ఈ సెషన్ మొత్తం అసెంబ్లీ నుంచి సస్పెన్షన్
ఇదిగో మీరు గవర్నర్ చేత చెప్పించిన అబద్ధాలు.. ఇక రాజీనామా చేయండి.. అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఆయన శనివారం నాడు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
గవర్నర్ ప్రసంగాల్లో అబద్ధాలంటూ కొన్ని అంశాలను చదివి వినిపించారు. ప్రభుత్వంపై చేసే అవినీతి ఆరోపణల్ని నిరూపించకపోతే ఆరోపణలు చేసిన వారిని జైలుకు పంపుతానని ముఖ్యమంత్రి చెప్పారని, సీఎం, ఆయన కుటుంబ సభ్యులపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, తనను జైలుకు పంపిస్తారా అని ప్రశ్నించారు.
తొలి అబద్దం.. అమరుల కుటుంబం
తాజా గవర్నర్ ప్ర సంగంతో పాటు, మూడేళ్ల ప్రసంగ కాపీలను కూడా మీడియాకు చూపించారు. 2014 గవర్నర్ ప్రసంగంలో అమరవీరుల కుటుంబాలకు రూ.10లక్షల ఆర్థిక సాయం, డబుల్ బెడ్రూం ఇళ్లను, ఉద్యోగాలను, ప్రభుత్వ భూ మిని ఇస్తానని ప్రకటించారని, అది ఇప్పటికీ అమలుకాలేదన్నారు.
రెండో అబద్దం.. ఎస్సీలకు కేటాయింపు
తొలి, మలి తెలంగాణ ఉద్యమంలో 1569 మంది అమరులయ్యారని సభలో ప్రకటించిన కేసీఆర్ ఇప్పటి వరకు 500 కుటుంబాలను మాత్రమే గుర్తించి ఆర్థిక సహాయం అందించారని, ఇతర సౌకర్యాలు కల్పించలేదన్నారు. 2014లో ఎస్సీల సమగ్రాభివృద్ధికి అయిదేళ్ల కాలంలో రూ.50వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించి, రూ.3వేల కోట్లు కూడా కేటాయించలేదన్నారు.
మరో రెండు అబద్దాలు..
బీసీ సమగ్రాభివృద్ధికి ఐదేళ్లలో రూ.25 వేల కోట్లు కేటాయిస్తామన్నారని, రూ.2 వేల కోట్లు దాటలేదని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో నాలుగు లక్షల మంది దళితులకు 12 లక్షల ఎకరాలు పంపిణీ చేయాలి, 15,500 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశారన్నారు.
ఎన్నో అబద్దాలని ఆగ్రహం
ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. చింతమడకకు, తోటపల్లికి తప్ప ఏ ఉళ్లొను మిషన్ భగీరథ కింద నీళ్లు ఇవ్వలేదని నిలదీశారు.
కేసీఆర్
కాగా, అంతకుముందు కేసీఆర్ మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగంలో అబద్దాలు ఉన్నాయని నిరూపిస్తే అయిదు నిమిషాల్లో రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఇక సభలో పత్రాలను చించివేయటం, అసత్య ఆరోపణలు చేయటం వంటివి ఎక్కువవుతాయని, తాము సభ ఔన్నత్యాన్ని కాపాడటంలో రాజీ పడదల్చుకోలేదని, రుజువు లేని ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.