టిఆర్ఎస్కు క్షమాపణలా: రేవంత్ రెడ్డి, టిఆర్ఎస్లో టిడిపి విలీనం కావొచ్చా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) కార్యకర్తలకు ఎర్రబెల్లి దయాకర రావు క్షమాపణలు చెప్పడం దారుణమని తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే, ప్రధాన కార్యదర్శి రేవంత్ రెడ్డి గురువారం నాడు అన్నారు. ఎర్రబెల్లి తన పైన చేసిన ఆరోపణల పైన చర్చకు సిద్ధమని చెప్పారు.
పార్టీ ఫిరాయించిన వారి పైన అనర్హత వేటుకు తాము ఫిర్యాదు చేశామని చెప్పారు. పార్టీల విలీనం ఉంటుంది కానీ, శాసన సభా పక్ష విలీనం ఉండదని చెప్పారు. పార్టీ ఫిరాయించిన వారి పైన అనర్హత వేటు వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కెసిఆర్ అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేయాలని కెసిఆర్ చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఎంతమంది పార్టీ వీడినా తమకు నష్టం లేదని చెప్పారు. పార్టీలోకి కొత్త రక్తాన్ని తెచ్చుకుంటామని అన్నారు.
టిఆర్ఎస్లో తెలంగాణ టిడిపి తెతెదేపా శాసనసభా పక్ష విలీనంపై చర్చ
తెలంగాణ టిడిపికి చెందిన 15 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే తొమ్మిది మంది తెరాసలో చేరడం, మరికొందరు అదే బాట పట్టే అవకాశం ఉండటంతో ఒకట్రెండు రోజుల్లో సంఖ్యాధిక (మెజార్టీ) ఎమ్మెల్యేలంతా కలిసి తెరాసలో విలీనం చేయమని స్పీకర్ను కోరే అవకాశముంది.
దీనికి అంగీకరిస్తూ తెరాస అధ్యక్షులు లేఖ ఇస్తే ఈ ఎమ్మెల్యేలందరినీ తెరాస సభ్యులుగానే గుర్తించే అవకాశం ఉంది. మూడింట రెండువంతుల మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే వారి పరంగా ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదని శాసనసభ వర్గాలు తెలిపాయి.
ఈ నేపథ్యంలో వీరిని అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా గుర్తించడానికే తెరాస పరిమితమవుతుందా లేక మెజార్టీ ఎమ్మెల్యేలు విలీనం చేస్తున్నట్లు ప్రకటిస్తే దానికి అవకాశం ఉందా అన్నది చర్చనీయాంశం అవుతోంది. ఇందులో స్పీకర్ నిర్ణయం కీలకం కానుంది.
దీనిపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వారు పార్టీకి రాజీనామా చేసినప్పుడు టిడిపి సభ్యులే కారని, అలాంటప్పుడు టిడిపిని తెరాసలో విలీనం చేస్తున్నట్లు ఎలా చెబుతారని అంటున్నారు. న్యాయపరంగా ఇలాంటి విలీనం చెల్లదంటున్నారు. మరోవైపు, శాసన సభా పక్షం విలీనం కాదని, పార్టీ విలీనం ఉంటుందన్నారు.