నా వెంట్రుకను కూడా.., నా పేరే చెప్పలేకపోయావ్: కేసీఆర్ను ఏకిపారేసిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్/కొడంగల్: రాబోయే 48 గంటల్లో కొడంగల్లో మరెన్నో అరాచకాలు సృష్టించేందుకు టీఆర్ఎస్ కుట్ర చేస్తోందని, అందుకు సంబంధించిన సమాచారం తన వద్ద ఉందని తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మంగళవారం చెప్పారు. కొడంగల్ ప్రజల అండ ఉన్నంత వరకూ తనను ఎవరూ ఏమీ చేయలేరన్నారు. కోస్గి సభలో తన పేరు ప్రస్తావించడానికి భయపడిన కేసీఆర్, ఇంకా నన్నేం ఓడిస్తారన్నారు.
పోలీసుల అదుపు నుంచి విడుదలైన అనంతరం ఆయన కొడంగల్లో కార్యకర్తలను, మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. పోలింగ్ స్లిప్పుల పంపిణీ ముసుగులో ఓటుకు రూ.5వేలు ఇచ్చి ఇక్కడి ప్రజలను ప్రలోభ పెడుతున్నారని, నిన్న సాయంత్రం నుంచి హరీష్ రావు ఆ పంపకాల పనిలో ఉన్నారని, ఇక్కడ స్లిప్పులు ఇస్తే హైదరాబాద్లో నగదు ఇచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారని, రూ. కోట్లు దొరికినా ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.
పట్నం, బంధువుల ఇళ్లలో కీలక డైరీ
కొడంగల్ తెరాస నియోజకవర్గం అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి, ఆయన బంధువుల నివాసంలో ఐటీ దాడుల సమయంలో దొరికిన డబ్బులు ఏమయ్యాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అక్కడ కీలక డైరీ దొరికిందని, ఆ డైరీలోని కొన్ని పేజీలను చించివేశారని, ఆ డబ్బును నల్లమల ద్వారా తరలించారని ఆరోపించారు. ఇంత జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ కావాలనే తమ నేతలపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు.
అరాచకం జరగవచ్చునని సమాచారం
రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేస్తే ఎన్నికల అధికారి రజత్ కుమార్.. డీజీపీని ఎందుకు వివరణ అడగలేదని చెప్పారు. మీరు విధులు ఎలా నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. తమ పార్టీ వారు హైకోర్టులో పిటిషన్ వేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తనను ఇప్పుడు విడుదల చేశారని చెప్పారు. పోలీసులు చాలా అన్యాయంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ 24 గంటల్లో ఏ అరాచకమైన జరగవచ్చునని రేవంత్ హెచ్చరించారు. తెరాస నేతలు ఎలాంటి దుర్మార్గానికైనా పాల్పడేందుకు సిద్ధంగా ఉన్నారని తనకు సమాచారం అందుతోందని చెప్పారు.
నా వెంట్రుక తాకలేరు, కేసీఆర్.. మిత్తితో చెల్లిస్తామని హెచ్చరిక
కొడంగల్ ప్రజల అండ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మద్దతు ఉన్నంత వరకు ఎవరు కూడా తన వెంట్రుకను కూడా తాకలేరని రేవంత్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 12న తమ ప్రభుత్వం వస్తుందని చెప్పారు. కేసీఆర్ చేసిన అరాచకాలు, అక్రమాలు, అవినీతికి అన్నింటికి మిత్తితో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. అధికారులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా రేవంత్ ఓ సూచన చేశారు. నిష్పక్షపాతంగా కాకుండా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దుర్వినియోగానికి పాల్పడిన అధికారులను శంకరగిరి మాన్యాలు పట్టిద్దామని చెప్పారు.
నా పేరు కూడా ఉచ్చరించలేకపోయారు
కేసీఆర్ కోస్గి వచ్చి తన పేరు కూడా ఉచ్చరించలేకపోయారని, తన కళ్లలోకి చూడలేడని, అలాంటి నీవు నన్ను కొడంగల్లో ఓడిస్తావా అని రేవంత్ రెడ్డి అన్నారు. అరే.. నీ సవాల్ కాదు.. అమరవీరుల స్థూపం వద్ద కూర్చొని చర్చించుకుందామా న్నారు. కొడంగల్ గురించి చర్చిద్దామా, రాష్ట్రం గురించి చర్చిద్దామా, మీ నీచ చరిత్ర గురించి చర్చిద్దామా అన్నారు. ఆ తర్వాత ఎవరు ఏం సవాల్ చేస్తారో చూద్దామా అన్నారు. తన పేరు చెప్పేందుకు కేసీఆర్ భయపడ్డారన్నారు.
ఆడవో.. మాడవో.. రా బిడ్డా చూద్దాం
అప్పుడు ఎవరు మగాడో, ఎవరు మొనగాడో, ఎవరు మడమతిప్పని వాడో, ఎవడు మడమతిప్పేవాడో, ఎవడు మీసం మెలేస్తే రాష్ట్రం కదులుతుందో చూద్దామా అని రేవంత్ అన్నారు. నువ్వు ఆడవో.. మాడవో మాకు తెలియదు.. రా బిడ్డా చూద్దాం.. రమ్మని చెబుతున్నా అన్నారు. నీ చుట్టూ సినిమావాళ్లు ఉంటున్నారని అనుకుంటున్నావా బిడ్డా.. నీ సంగతి చూస్తానని చెబుతున్నా అన్నాడు. తన కోసం అహర్నిషలు కంటికి రెప్పలా కాపాడుకొని, గుండెల్లో పెట్టుకొని చూసుకొని, ఏదో మారుమూల గ్రామం నుంచి వచ్చిన తనకు ఈ స్థానం కల్పించి, రేవంత్ను ఢిల్లీ గుర్తించే పరిస్థితి రావడానికి తన నియోజకవర్గం ప్రజలు నాటిన మొక్క అన్నారు. షాబాద్ నుంచి, సిద్దిపేట నుంచి ఎవరెవరో వస్తుంటే, తనకు, తన సోదరులకు, తన కుటుంబానికి అండగా నిలబడ్డ కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు అన్నారు.