కేసీఆర్ ను వదలను .. ఎదిరించేవారు లేకుంటే బెదిరించే వారిదే రాజ్యం అన్న రేవంత్ రెడ్డి
తెలంగాణా రాష్ట్రంలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వా నేనా అంటూ కేసీఆర్ తో తలపడిన ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఓటమి పాలయ్యారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుండి పోటీ చేసిన రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిని ఓటమి పాలు చేశారు . తెలంగాణా రాష్ట్రంలో మొత్తం లోక్సభ స్థానాలను క్లీన్ స్వీప్ చేయబోతున్నామని చెప్పుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణా ప్రజలు షాక్ ఇచ్చారు. రేవంత్ రెడ్డిని గెలిపించి రేవంత్ కు ఓ అవకాశం ఇచ్చారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందుంది మరో ఎన్నికల సవాల్
కేసీఆర్ కు గుణపాఠం చెప్పింది మల్కాజ్ గిరి ప్రజా చైతన్యం ..కేసీఆర్ ను వదలను అంటున్న రేవంత్ ..
ఇక ఎమ్మెల్యేగా ఓడి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి కేసీఆర్ ను వదలనని తేల్చి చెప్తున్నారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఒక మినీ భారత దేశం అని భారతదేశంలో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయో అన్ని ప్రాంతాల ప్రజలు నివసించే ఏకైక నియోజకవర్గం మల్కాజ్గిరి అని, దేశంలోనే అతి పెద్ద నియోజకవార్గం అని అలాంటి చోట అందరు తనను గెలిపించారని కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎంపీలకు కార్యకర్తలు మంగళవారం గాంధీభవన్లో సన్మానం చేశారు. తెలంగాణా సమాజంలోని 12 శాతం ఉన్న మల్కాజ్ గిరి ప్రజలు తనను ఆదరించారని , ప్రజాస్వామ్యం పరిరక్షించటానికి, కేసీఆర్ కు గుణపాఠం చెప్పటానికి మల్కాజ్ గిరి ప్రజలు కీలక భూమిక పోషించారని చెప్పారు.
కొడంగల్ లో కుట్రలు చేసి ఓడించినా .. మల్కాజ్ గిరి ప్రజలు ఆదరించారన్న రేవంత్ రెడ్డి
ఈ కార్యక్రమంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్, హరీశ్లు కొడంగల్లో కుట్రలు చేసి, అధికారాన్ని దుర్వినియోగం చేసి తనను ఓడించారన్నారు. అక్కడ తనను ఓడించినప్పటికీ.. ప్రజలు కేసీఆర్కు గుణపాఠం చెప్పడానికే తనను మల్కాజ్గిరిలో గెలిపించారని రేవంత్ తెలిపారు. కేసీఆర్ ను ఎదిరించే వారు లేకుంటే పాలన సరిగా సాగదని నమ్మే తనను గెలిపించారని ఆయన చెప్పారు. మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని ప్రజలు తనను 11 వేల మెజారిటీతో గెలిపించారన్నారు. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యమవుతుందని ప్రజలు భావించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రశ్నించే వారు ఉండాలనే తనను గెలిపించారని చెప్పిన రేవంత్
ప్రశ్నించే వారు ఉండాలని భావించి మల్కాజ్ గిరి ప్రాంత ప్రజలు పట్టం కట్టారు. ఇది ప్రజల గెలుపు అని రేవంత్ పేర్కొన్నారు. అలాగే కేసీఆర్ పాలనను ప్రశ్నించేందుకు, ఎదిరించేందుకు అవకాశం ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. తన గెలుపుతో ప్రజా స్వామ్యం కాపాడేందుకు ప్రజలే నడుం బిగించారని ఆయన అన్నారు. కేసీఆర్తోనే కాకుండా మోడీ, అమిత్షాలపైనా తాము పోరాటం చేస్తామన్నారు.