టీఆర్ఎస్ నుంచి నాకు ప్రాణహాని, నాయినికి రూ.10కోట్లిస్తామని..: ఈసీకి రేవంత్ ఫిర్యాదు
హైదరాబాద్: తనకు టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
నాయినికి రూ.10కోట్లిస్తామన్న కేసీఆర్..
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్, సంయుక్త ఎన్నికల ప్రధానాధికారి ఆమ్రపాలిని శనివారం రేవంత్ రెడ్డి కలిశారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్.. రూ.10కోట్లు తనకు ఇస్తానన్నారంటూ హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
కేసీఆర్పై చర్యలు తీసుకోండి
నాయిని వ్యాఖ్యల ఆధారంగా సుమోటాగా కేసు నమోదు చేయాలని, లేదంటే తన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయాలని కోరినట్లు రేవంత్ చెప్పారు. నాయిని స్టేట్మెంట్ రికార్డు చేసి కేసీఆర్పై చర్యలు తీసుకోవాలని కోరినట్లు రేవంత్ తెలిపారు.
టీఆర్ఎస్ సర్కారు నుంచి ప్రాణహాని..
ఇటీవల మంత్రి జగదీశ్వర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ బాల్క సుమన్ తనను భౌతికంగా అంతమొందిస్తామని హెచ్చరించారని రేవంత్ తెలిపారు. టీఆర్ఎస్ సర్కారు నుంచి తనకు ప్రాణహాని ఉన్నట్లు ఈసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
డీజీపీపై నమ్మకం లేదు
డీజీపీ మహేందర్ రెడ్డి గతంలో నాగార్జునసాగర్లో జరిగిన టీఆర్ఎస్ నేతల శిక్షణకు హాజరైనందున ఆయనపై తనకు నమ్మకం లేదని, కేంద్ర సంస్థల సిబ్బందితో తనకు భద్రత కల్పించాలని కోరినట్లు తెలిపారు.