భూ వివాదంలో రేవంత్ రెడ్డి.. డిప్యూటీ కలెక్టర్ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం..
గ్రేటర్ హైదరాబాద్లోని శేరిలింగంపల్లి పరిధిలో ఉన్న గోపన్పల్లిలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి రెడ్డి,ఆయన సోదరుడు కొండల్ రెడ్డి తప్పుడు డాక్యుమెంట్లతో 6.2 ఎకరాల భూమిని రాయించుకున్నారన్న ఆరోపణలు తెర పైకి వచ్చాయి. రెవిన్యూ అధికారుల సహకారంతోనే ఈ అక్రమాలు జరిగాయని రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక పంపించారు.
గతంలో శేరిలింగపల్లి తహసీల్దార్గా పనిచేసిన ప్రస్తుత డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఇందుకు బాధ్యుడని నివేదికలో పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వంపై ఆయనపై చర్యలకు దిగింది. డిప్యూటీ కలెక్టర్గా ఉన్న ఆయన్ను సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని.. తద్వారా మరిన్ని భూ లావాదేవీలు బయటకొచ్చే అవకాశం ఉందని కలెక్టర్ నివేదికలో కోరారు.
మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలను ఎంపీ రేవంత్ రెడ్డి ఖండించారు. రికార్డులను ట్యాంపరింగ్ చేశామనడం పచ్చి అబద్ధమన్నారు. 2005లో భూములు కొనుగోలు చేస్తే 1978లో రికార్డులు ఎలా ట్యాంపర్ చేస్తామని ప్రశ్నించారు. ఇది తమ ప్రైవేట్ వ్యవహారమని,ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు.డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రామేశ్వరరావుపై కేసుల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే తనపై ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు తనకు ఎలాంటి నోటీసులు రాలేదని, వచ్చాక స్పందిస్తానని రేవంత్రెడ్డి పేర్కొన్నారు.