టీఆర్ఎస్ ఏం చేసినా, 30 వేల ఓట్ల మెజార్టీతో గెలుపు: రేవంత్ రెడ్డి ధీమా
కొడంగల్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని టీఆర్ఎస్ నేతలు ప్రధానంగా టార్గెట్ చేసుకున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ను నిత్యం టార్గెట్ చేస్తున్న రేవంత్ను కొడంగల్లో ఓడించాలని టీఆర్ఎస్ అధిష్టానం గట్టి ప్రయత్నాలు చేస్తోంది.
ఇందుకోసం కొడంగల్ నియోజకవర్గం నుంచి ఆపద్ధర్మ మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు నరేందర్ రెడ్డిని రంగంలోకి దింపుతోంది. కొడంగల్లో ఎవరు పోటీ చేసినా, ఐటీ దాడులు, ఈడీ దాడులు అంటూ తనపై ఒత్తిడి చేసినా తన నియోజకవర్గంలో తన గెలుపును ఎవరూ ఆపలేరని రేవంత్ ధీమాగా ఉన్నారు.
అడ్డమైన దొంగ చంద్రబాబుతో పొత్తా, తూ.. మీ బతుకు చెడా: కేసీఆర్ తిట్లదండకం
30వేల మెజార్టీతో గెలుస్తానని రేవంత్ ధీమా
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ విజయబావుటా ఎగురవేస్తుందని రేవంత్ ధీమాగా ఉన్నారు. ఓ వైపు తెలంగాణవ్యాప్తంగా ప్రచారం చేస్తూనే మరోవైపు తన కొడంగల్ నియోజకవర్గంపై దృష్టి సారించారు. ఇక్కడ 30వేలకు పైగా మెజార్టీతో తాను గెలుస్తానని ధీమాగా ఉన్నారు.
రెండు లక్షల మంది ఓటర్ల అండ
తన నియోజకవర్గంలో రెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారని, వారి అండతోనే తాను ఇంతగా ఎదిగానని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. తనపై ఐటీ దాడులు జరిగినప్పటికీ తాను ఆత్మస్థైర్యం కోల్పోలేదని చెప్పారు. ఐటీ దాడుల సమయంలో కనీసం తనను నిద్ర కూడా పోనీయలేదని చెప్పారు.
రేవంత్ రెడ్డి అండతోనే వారి గెలుపు
కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి మద్దతుతతో ఐదుగురు ఎంపీపీలు, ఐదుగురు జెడ్పీటీసీలు, 81 మంది సర్పంచ్లు ఎన్నికయ్యారట. తన చివరి క్షణాల వరకు కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం పాటుపడతానని చెప్పారు.
రేవంత్ను ఎవరూ ఓడించలేరని
తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కొడంగల్ నియోజకవర్గంలో తనకు సరితూగలేడని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రేవంత్ గెలుపునూ ఎవరూ ఆపలేరని ఆయన అభిమానులు, అనుచరులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెరాస నుంచి ఎవరు నిలబడ్డా రేవంత్ను ఓడించలేరని అంటున్నారు.