అధికారంలోకి వచ్చాక దెబ్బకు దెబ్బ, అంతకుమించి వేధిస్తాం, మీ సంగతి చూస్తాం: రేవంత్ వార్నింగ్
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేత, తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలను ఈ ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. తమ పార్టీ నేతలను ఎంతగా వేధిస్తున్నారో అంతకుమించి వేధిస్తామని షాకింగ్ కామెంట్స్ చేశారు. తాము (కాంగ్రెస్) అధికారంలోకి రాగానే దెబ్బకు దెబ్బ తీస్తామని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎవరికీ బాకీ పడదని చెప్పారు. వడ్డీతో సహా వారికి తిరిగి చెల్లింపులు ఇస్తామని తెలిపారు. ఆపద్దర్మ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తనతోనే వేట ప్రారంభించారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కానీ తమపై కేసులు పెట్టడానికి మించి ఏం చేయలేడన్నారు.
మరో షాక్: జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అవకతవకల కేసులో రేవంత్ రెడ్డికి నోటీసులు
కొందరు ఐపీఎస్లు ప్రభుత్వానికి మోకరిల్లుతున్నారు
తెలంగాణలోని కొందరు ఐపీఎస్ అధికారులు ప్రభుత్వానికి మోకరిల్లుతున్నారని రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. అందులో భాగంగా కాంగ్రెస్ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. ఐపీఎస్ అధికారులపై విచారణ జరిపే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని తెలిపారు.
అధికారంలోకి వచ్చాక సంగతి చూస్తాం
రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అధికారుల సంగతి చూస్తామని కూడా రేవంత్ రెడ్డి హెచ్చరించారు. శాంతిభద్రతల సమస్యను గవర్నర్ నరసింహన్ సమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. తన సామాజిక వర్గానికి చెందిన అధికారులను హైదరాబాద్, నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో కేసీఆర్ నియమిస్తున్నారని ఆరోపించారు.
గవర్నర్ దూరంగా పారిపోకూడదు
వారి ద్వారా తమపై (కాంగ్రెస్ నేతలు)పై దాడికి ప్రయత్నాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. అన్ని విషయాలను గవర్నర్ సమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. బాధ్యలకు దూరంగా పారిపోకూడదని హితవు పలికారు. ఏదైనా జరిగితే మీరు కూడా చట్టం ముందు సమాధానం చెప్పవలసి ఉంటుందన్నారు.
నోటీసులపై రేవంత్ ఆగ్రహం
జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం ఆయనకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని అరెస్టు చేశారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అంశంలో రేవంత్కు నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లోగా విచారణకు హాజరు కావాలని రేవంత్ సహా 13 మందికి నోటీసులు ఇచ్చారు. తప్పుడు పత్రాలతో ఇళ్ల స్థలాలను కేటాయించారనే ఆరోపణలు రేవంత్ మీద ఉన్నాయి. దీనిపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.